పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేదాకా దీక్ష ఆగదన్న వైఎస్ఆర్ టీపీ చీఫ్​

పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేదాకా దీక్ష ఆగదన్న వైఎస్ఆర్ టీపీ చీఫ్​
  • ట్యాంక్​బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం 
  • అరెస్ట్ చేసి, లోటస్​పాండ్​కు తరలించిన పోలీసులు 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేంత వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ షర్మిల తేల్చి చెప్పారు. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆమె ఆమరణ దీక్షను చేపట్టారు. ముందుగా ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఉదయం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. అనంతరం షర్మిల అంబేద్కర్ విగ్రహం దగ్గర పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో ఇక్కడ దీక్షకు అనుమతి లేదని, వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. వెళ్లబోమని తేల్చి చెప్పటంతో షర్మిలను అరెస్ట్ చేసి, లోటస్ పాండ్ లోని ఆమె నివాసం వద్ద వదలిపెట్టారు.  

లోటస్ పాండ్ వద్ద టెన్షన్  

లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. పార్టీ నేత రాజగోపాల్ సహా ఇతర నేతలపై, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై మండిపడిన షర్మిల మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకూ రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ గా పని చేస్తున్నారని ఆరోపించారు. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా భయపడబోమన్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా ఇంటి బయట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి తీసుకెళ్లారు. తన ఇంటి దగ్గర తాను దీక్ష చేపడితే ఇన్ని ఆంక్షలా? అంటూ ఈ సందర్భంగా షర్మిల మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించిన షర్మిల వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె తల్లి వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత దీక్ష శిబిరం వద్ద షర్మిలను కలిసి ఆమె మాట్లాడారు.