పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. తనను అడ్డుకున్న పోలీసులకు హారతిచ్చి నిరసన తెలిపారు. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలని ప్రశ్నించారు. కేసీఆర్ దళిత ద్రోహి అని.. కేసీఆర్ తనను చూసి భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్ పాండ్ లోని తన ఇంటి దగ్గర బైఠాయించి దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.
బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ మండిపడ్డారు. దళితబందులో అవకతవకలు జరిగాయన్నారు. దళితబంధులో అవినీతిపై కేసీఆరే చెప్పారన్నారు. కేసీఆర్ కు పాలన చేతకాదని.. యాక్షన్ తీసుకోకపోతే కేసీఆర్ సీఎం పదవిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటన పెట్టుకున్నారు షర్మిల. జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో పర్యటించాల్సి ఉంది. దళితబంధులో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామంలో ఆందోళనలు జరిగాయి. వాళ్లతో మాట్లాడేందుకు షర్మిల గజ్వేల్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె బయటకు వెళ్లకుండా లోటస్ పాండ్ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. గజ్వేల్ వెళుతానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు షర్మిల