Yuvraj Singh Biopic: వెండితెరపై సిక్సుల వీరుడి బయోపిక్..అదిరిపోయిన టైటిల్!

Yuvraj Singh Biopic: వెండితెరపై సిక్సుల వీరుడి బయోపిక్..అదిరిపోయిన టైటిల్!

భారతీయ క్రికెట్‌ చరిత్రలో యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఓ సంచలనం. ఆయన జీవితం ఓ పోరాటం.ఒకే ఒక్క ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.13 ఏళ్ల వయసులోనే పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు ఆడిన యువరాజ్ సింగ్ ఇప్పటికీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. తాజాగా మంగళవారం (ఆగస్ట్ 20) వెండితెరపై సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ బయోపిక్ రానుందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో నిర్మాత రవి భాగ్ చందక అధికారిక ప్రకటన చేశారు.

అయితే, యువీ బయోపిక్‌కు సిక్స్ సిక్సెస్ (Six Sixes) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం. "పిచ్ నుండి మిలియన్ల మంది హృదయాలను సంపాదించున్న లెజెండ్ ప్రయాణాన్ని చూపిస్తాం. యువరాజ్ సింగ్ ధైర్యసాహసాలు, కీర్తివంతమైన కథ త్వరలో వెండితెరపై రానుంది" అని నిర్మాతలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు యువరాజ్ సింగ్‌తో ఉన్న ఫొటోలను సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే, ఈ క్రేజీ బయోపిక్ లో యువీ రోల్ లో నటించే హీరో ఎవరు? ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసేదెవరు అనేది ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఇప్పటికీ, ఎంతో మంది క్రిడాకారుల జీవితాలపై సినిమాలు వచ్చాయి. అందులో చూసుకుంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ మహిళా సారథి మిథాలీ రాజ్, మాజీ పేసర్ జులన్ గోస్వామి, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ సారథి మొహమ్మద్ అజారుద్దీన్‌ల బయోపిక్స్ తెరకెక్కి విజయం సాధించాయి. 

ఇక ఈ బయోపిక్‌లో ఏం చూపిస్తారా అని అందరిలోను ఆసక్తి నెలకొంది.19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన యువీ..40 టెస్ట్, 304 వన్డే, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువరాజ్..2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. 2011 వరల్డ్‌కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు.

వరల్డ్‌కప్ అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడిన యువీ..అమెరికాలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. తనదైన శక్తిని కూడగట్టుకుని క్యాన్సర్‌తో పోరాడి ఆయన ఎంతోమందిలో మనోధైర్యాన్ని నింపారు. మరి ఇప్పుడీ తెరకెక్కించనున్న బయోపిక్‌లో కేవలం క్రికెట్‌కు సంబంధించిన విషయాలనే చూపుతారా లేదంటే..క్యాన్సర్‌తో అతడు చేసిన పోరాటాన్ని కూడా చూపిస్తారో తెలియాల్సి ఉంది.యువరాజ్ సింగ్ కు భారత ప్రభుత్వం నుండి అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు.