Ram Charan: రామ్ చరణ్‌తో మెల్‌బోర్న్‌ మేయర్‌ సెల్ఫీ..నా కల నెరవేరిందంటూ పోస్ట్​

Ram Charan: రామ్ చరణ్‌తో మెల్‌బోర్న్‌ మేయర్‌ సెల్ఫీ..నా కల నెరవేరిందంటూ పోస్ట్​

హీరో రామ్‌‌చరణ్‌‌(Ram Charan)..ప్రతిష్టాత్మక ఇండియన్‌‌ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌‌బోర్న్‌‌ (IFFM 2024) 15వ ఎడిషన్‌‌కు గౌరవ అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్‌‌‌‌ బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌‌‌ అవార్డును ఆయన అందుకుని తొలి ఇండియ‌‌న్ సెలబ్రిటీగా రామ్‌‌చ‌‌ర‌‌ణ్ నిలిచాడు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో అభిమానులతో కలిసి చరణ్‌ సెల్ఫీలు దిగారు. చరణ్‌తో మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్‌ రీస్‌ (Nick Reece) సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై నిక్‌ రీస్‌ తాను కూడా రామ్‌ చరణ్‌కు వీరాభిమానినని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘మెల్‌బోర్న్‌ నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ ఉంటున్న భారతీయులది పెద్ద పాత్ర. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి రోషెనాతో కలిసి నేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్లాను. రామ్‌ చరణ్‌తో సెల్ఫీ తీసుకున్నా. నా కోరికల లిస్ట్‌లలో ఇది ఒకటి. దీంతో నా కోరిక తీరింది. అక్టోబర్‌లో డిప్యూటీ మేయర్‌గా రోషెనా ఎన్నికైతే చరిత్ర సృస్టిస్తారు. 182 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పదవిని పొందిన భారతీయ వారసత్వపు మొదటి వ్యక్తి రోషెనా అవుతారు. ఆమెతో కలిసి ఈ ఈవెంట్‌కు వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని నిక్‌ రీస్‌ పేర్కొన్నారు.

ఈ మేరకు చరణ్ స్పందిస్తూ..మెల్‌బోర్న్‌ ప్రాంతం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. ‘మెల్‌బోర్న్‌ ప్రాంతమంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ షూటింగ్‌ చేసిన ఆరెంజ్‌ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. భారతీయ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని చరణ్‌ వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్‌’మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐఎఫ్‌‌ఎఫ్ఎమ్ IFFM  అనేది ఆస్ట్రేలియాలోని విక్టోరియన్‌‌ స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఏడాది నిర్వహించే ఫిల్మ్ ఫెస్టివల్. ఆగస్టు 15 నుంచి 25 వరకూ ఈ వేడుకలు జరగనున్నాయి.