మాసబ్ ట్యాంక్ : రెండు విడతల్లో ZPTC, MPTC ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ణయించింది. వచ్చే మే నెల 6 , 10 తేదీల్లో ZPTC, MPTC ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఐతే.. ఈ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే విడుదల చేస్తారు. ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు అధికారులు.
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఎల్లుండి సోమవారం రోజున CS శైలేంద్రకుమార్ జోషి, DGP మహేందర్ రెడ్డితో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది స్టేట్ ఎలెక్షన్ కమిషన్. ఏప్రిల్ 18 న హోటల్ మ్యారియట్ లో అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్ లతో మీటింగ్ కానుంది. శాంతి భద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. 18 వ తేదీ సమావేశం తర్వాత ఎన్నికల నిర్వహణపై మరింత స్పష్టత వస్తుందంటున్నారు అధికారులు.
ZPTC, MPTC ఎన్నికలు బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహిస్తామని చెప్పారు. MPTC ఎన్నికలకు పింక్ కలర్ బ్యాలెట్.. ZPTC ఎన్నికలకు తెల్లని రంగు బ్యాలెట్ వాడుతామన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్ధులకు 100 వరకు గుర్తులను అందుబాటులో ఉంచారు అధికారులు. రాష్ట్రంలో 1 కోటి 57 లక్షల ఓటర్లు ఉన్నారు. మరో 3 లక్షల ఓటర్లు పెరిగే అవకాశం ఉందని చెప్పారు అధికారులు.