
- పోలీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ
- పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్
- డ్యూటీ చేశామని పోలీసుల వెల్లడి
- మీడియాతో మాట్లాడటం చట్టవిరుద్ధమని ప్రకటన
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ లీడర్లు మండిపడ్డారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీశ్ మెడపై చేయి వేసి పోలీసు అధికారి ఒకరు లాక్కెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం మనీశ్ను పోలీసులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీపై విమర్శలు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ని
అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
షాక్కు గురయ్యాం: ఆప్ లీడర్లు
మనీశ్ సిసోడియాను మెడపై చేయ్యేసి లాక్కెళ్తున్న వీడియోను ఆప్ లీడర్ ఆతిషి తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘‘రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీశ్తో పోలీసు అధికారి దారుణంగా ప్రవర్తించాడు. చూసి షాక్కు గురయ్యాను. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి” అని అతిషి డిమాండ్ చేశారు. ‘‘మనీశ్జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా? లేదంటే ఇలా చేయమని పోలీసులకు పైన ఉన్నోళ్లు ఎవరైనా ఆదేశిస్తున్నారా?’’ అంటూ కేంద్రంపై సీఎం కేజ్రీవాల్ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తమ బాస్ను సంతోషపెట్టేందుకే సిసోడియా మెడపై చేయి వేసి పోలీస్ ఆఫీసర్ లాక్కెళ్లాడు. దీనిపై కోర్టు స్పందించాలి. మోడీ జీ.. ఇండియా మొత్తం మీ నియంతృత్వ పాలన చూస్తున్నది” అని ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు.
ఆప్ లీడర్ల ఆరోపణల్లో నిజం లేదు : పోలీస్ శాఖ
ఆప్ లీడర్ల విమర్శలను ఢిల్లీ పోలీసు శాఖ ఖండిం చింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు మీడియాతో మాట్లాడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీశ్ సిసోడియాతో పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించలేదు. ఆప్ లీడర్ల ఆరోపణల్లో నిజం లేదు. మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే ఓ పోలీసు అధికారిగా మనీశ్ను తీసుకెళ్లిపోయాడు. అతను డ్యూటీ మాత్రమే చేశాడు. వీడియోను సెక్యూరిటీ పరంగానే చూడాలి”అని పోలీసు శాఖ ట్వీట్ చేసింది.
జూన్ 1వరకు కస్టడీ పొడిగింపు
లిక్కర్ స్కామ్ కేసులో వాదనలు విన్న ఢిల్లీ కోర్టు.. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. చదువుకునేందుకు కొన్ని పుస్తకాలు కావాలని, ఒక టేబుల్, కుర్చీని కూడా ఏర్పాటు చేయాలని జడ్జిని మనీశ్ సిసోడియా కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జడ్జి.. సిసోడియాకు అవసరమైన పుస్తకాలతో పాటు టేబుల్, కుర్చీ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించారు.
అస్థిపంజరంలా మారిన సత్యేంద్ర జైన్
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ను చూసి సీఎం కేజ్రీవాల్తో పాటు ఆప్ లీడర్లు షాక్కు గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచింది. వెన్నెముక సమస్య కారణంగా ఆయనను సోమవారం సఫ్దర్జంగ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. కుర్చీపై కూర్చొని ఉండగా ఇద్దరు పోలీసులు ఆయనతో మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆప్ లీడర్లు స్పందించారు. ‘‘సత్యేంద్ర జైన్ అస్థిపంజరంలా మారిపోయారు. ఇప్పుడు బీజేపీకి సంతోషంగానే ఉంటది. ఆయన్ని చంపేద్దామనుకుంటున్నారా? ఆయన్ని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు సెలెబ్రేషన్స్ చేసుకోండి” అంటూ బీజేపీపై ఆప్ లీడర్లు మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..?
లిక్కర్ స్కామ్ కేసు విచారణ తర్వాత కోర్టు రూం నుంచి మనీశ్ను బయటకు తీసుకొస్తుండగా మీడియా చుట్టుముట్టింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై మీ అభిప్రాయం ఏంటని మీడియా ప్రశ్నించగా.. ‘‘మోడీ చాలా అహంకారిగా మారారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు’’ అని సిసోడియా బదులిచ్చారు. వెంటనే పోలీసు అధికారి ఒకరు రిపోర్టర్లను పక్కకు నెడుతూ మనీశ్ సిసోడియా మెడ చుట్టూ చేయి వేసి అక్కడి నుంచి తీసుకెళ్లాడు.