- భారీగా నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- 7.60 లక్షల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లకు కొత్త శోభ
- 10 ఏండ్ల పాటు సమగ్ర నిర్వహణకు జీవో 91 జారీ
- సీసీఎంఎస్ పర్యవేక్షణతో వెలగని లైట్లకు చెక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో స్ట్రీట్ లైట్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మొత్తం 7,60,591 ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల సమగ్ర ఆపరేషన్, మెయింటెనెన్స్ కోసం రూ.1,341.60 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి ఇస్తూ ఎంఏయూడీ జీవో 91 జారీ చేసింది. ఈ పనులను 10 ఏండ్ల కాలానికి కాంప్రెహెన్సివ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విధానంలో నిర్వహించనున్నారు. నగర వీధుల్లో వెలగని లైట్లను త్వరగా మార్చడం, ఆస్తి నిర్వహణను శాస్త్రీయంగా అమలు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
కొత్త విధానంలో పర్యవేక్షణ
నగరంలో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ప్రాజెక్ట్ను గతంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా అమలు చేశారు. ఆ ఒప్పందం 2025 ఏప్రిల్ 30తో ముగియనుండటంతో స్ట్రీట్ లైట్ల నిర్వహణకు కొత్త విధానం అవసరమైంది. జీహెచ్ఎంసీ సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరంలోని అన్ని ఎల్ఈడీ దీపాలను కేంద్రీకృత మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.
ఏదైనా లైట్ పనిచేయకపోతే సిస్టమ్ వెంటనే గుర్తించి మరమ్మత్తు చేసేలా చర్యలు తీసుకుంటారు. అవసరమైన చోట కొత్త లైట్లు అమర్చడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్ చేయడం ఈ ప్రాజెక్ట్ ద్వారా సులభతరం కానుంది.
