
- కామారెడ్డి జిల్లాలో వరి, మక్క విత్తనాలు 1,419 కిట్ల అందజేత
- ప్రతి గ్రామంలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు
- ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ
కామారెడ్డి, వెలుగు : ప్రతి పల్లెలో నాణ్యమైన విత్తన ఉత్పత్తి చేయించేందుకు ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం-..రైతన్నకు నేస్తం’ కార్య క్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో వరి, మక్క విత్తనాల ఉత్పత్తి చేయించనున్నది. ఇక్కడ వరి, మక్క పంట అధిక విస్తర్ణంలో సాగు కానుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతులను ఎంపిక చేసి, జిల్లాలో 1,419 విత్తన కిట్లను అధికారులు అందజేశారు. విత్తనం నాటిన దగ్గరి నుంచి దిగుబడి వచ్చే వరకు అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు. మిగతా రైతులకూ ఈ క్షేత్రం దగ్గర విత్తన ఉత్పత్తిపై అవగాహన కల్పిస్తారు.
సాగు సీజన్లో విత్తనాల సమస్య..
సాగు సీజన్ వచ్చిందంటే రైతులు విత్తనాల సమస్య వెంటాడుతోంది. మార్కెట్లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. దిగుబడి రాకపోవటం, తెగుళ్ల సమస్య, పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విత్తన సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రణాళిక రూపొందించింది. ఆయా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా విత్తనాలను అందించేందుకు కార్యచరణ చేపట్టింది. ఒక్కో రైతు అర ఎకరం విత్తన పంట సాగు చేసి దిగుబడి వచ్చిన తర్వాత వాటిని స్థానికంగా మిగతా రైతులకు అమ్ముకోవచ్చు. ఈ విత్తనం 3 జనరేషన్లకు వాడవచ్చు. అర ఎకరానికి సరిపడా విత్తన కిట్ ఇచ్చారు. ఒక్కో కిట్కు రూ. 50 రైతులు చెల్లించారు.
జిల్లాలో 1,419 మంది రైతులకు పంపిణీ..
కామారెడ్డి జిల్లాలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతుల చొప్పున మొత్తం 1,419 మందికి విత్తన కిట్లు ఇచ్చారు. వరి సన్నరకం 900 కిట్లు, దొడ్డు రకం 46 కిట్లు, మక్క 473 కిట్లు ఉన్నాయి. సన్నరకానికి సంబంధించి జేజీఎల్ 27356 రకం, దొడ్డు వరి జేజీఎల్ 24423 కరం, మక్క డీహెచ్ఎం 117 రకం విత్తన కిట్లను ఇచ్చారు. కిట్లు తీసుకున్న రైతులు ఇప్పటికే వరి నార్లు పోశారు.
పర్యవేక్షణ, సూచనలు, సలహాలు..
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విత్తనాలు ఇవ్వడంతోనే సరిపెట్టకుండా విత్తన సాగు మొదలు దిగుబడి వచ్చే వరకు సైంటిస్టులు, అగ్రికల్చర్ అధికారులు పర్యవేక్షిస్తారు. మండలానికో సైంటిస్టును కేటాయించారు. సైంటిస్టులు, అధికారులు తరచుగా ఆయా ఏరియాల్లో సాగు చేసిన విత్తన క్షేత్రాలను పరిశీలిస్తారు. రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. సాగుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తారు. మిగతా రైతులతో విత్తన క్షేత్ర సందర్శన కూడా చేయించనున్నారు.
రైతులకు మేలు..
రైతులతో విత్తన ఉత్పత్తి చేయించి, దిగుబడి వచ్చిన తర్వాత రేటు రైతులే నిర్ణయించుకుని స్థానికంగానే అమ్ముకోవచ్చు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో 1,419 మంది రైతులకు విత్తన కిట్లు ఇవ్వగా నార్లు పోశారు. - తిరుమల ప్రసాద్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కామారెడ్డి