జమ్మూకశ్మీర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతోన్న అభివృద్ధి పనులు ఆ ప్రాంతంలోని ఓ యువకుడిని ఆకర్షించాయి. దీంతో మోడీని కలిసి కృతజ్ణతలు తెలిపేందుకు ఏకంగా 815 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఫాహిమ్ నజీర్ షా అనే యువకుడు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించాడు.
శ్రీనగర్లోని షాలిమార్ చెందిన నజీర్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. తన యాత్రలో భాగంగా ఇప్పటికి 200 కిలోమీటర్లు నడిచి.. ఆదివారం రోజు ఉధంపూర్ నగరానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తాను మోడీకి వీరాభిమానినని తెలిపాడు. తాను ఆయన్ను కలవడానికి కాలినడకన ఢిల్లీకి వెళుతున్నానని తెలిపాడు. ఇలా కాలినడకన వెళ్తే మోడీని కలిసే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
మోడీని కలవాలని తాను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నానని తెలిపాడు నజీర్. నాలుగేళ్లుగా తాను సోషల్ మీడియాలో ప్రధానిని ఫాలో అవుతున్నానని చెప్పాడు. గతంలో ఓసారి ర్యాలీలో మోడీ మాట్లాడుతుండగా.. ‘అజాన్’ (ప్రార్థన చేయడానికి ముస్లిం పిలుపు) వినగానే ఒక్కసారిగా ఆయన తన స్పీచ్ ను ఆపేశారని.. ప్రార్థనను అంతగా గౌరవించారని చెప్పాడు. మోడీ చూపిన ఆ సంస్కారం తనను ఎంతగానో ఆకర్షించిందని తెలిపాడు.
మోడీ కశ్మీర్కు వచ్చినప్పుడు ఆయనను కలిసేందుకు భద్రతా సిబ్బంది తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. పాదయాత్ర చేస్తుండడంతో ఈ సారి మోడీని కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపాడు. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో మార్పు కనిపిస్తోందని చెప్పాడు. కశ్మీర్ లో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయన్నాడు. తాను నిరుద్యోగ యువకుల సమస్యలపై మోడీతో మాట్లాడతానని చెప్పాడు నజీర్.