గత వారం రోజులుగా పదివేలకు పైగా నమోదు అవుతూ వస్తోన్న కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ 24 సోమవారం నాటికి కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7,178 కేసులు నమోదయ్యాయి. వైరస్ కు మరో 16 మంది బలయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,683గా ఉంది. 9,011 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించబడ్డాయి.
ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 ఎఫెక్ట్ తోనే.. కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెల చివరి నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అప్పటి వరకు ఇదే రీతిన కరోనా కేసులు పెరుగుతాయని.. జనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని.. నలుగురిలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వచ్చినా మరణాలు సంఖ్య చాలా చాలా తక్కువగా ఉందని.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే మరణాలు జరుగుతున్నాయని.. కేవలం కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య ఒకటీ, రెండు మాత్రమే ఉంటున్నాయని చెబుతున్నారు అదికారులు.