అబిడ్స్, వెలుగు: అవినీతి ఆరోపణల నేపథ్యంలో నాంపల్లిలోని గగన్ విహార్ భవనంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. గాంధీ భవన్ ఎదురుగా ఉన్న ఈ భవనంలోని 7వ అంతస్తులో జీడిమెట్ల సర్కిల్-2 వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా తాజాగా క్లియర్ అయిన ఫైళ్లను అధికారులు పరిశీలించారు.
సోదాల్లో భాగంగా కొన్ని కీలక పత్రాలతో పాటు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాత అవకతవకలు బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
