సికింద్రాబాద్​ పార్లమెంట్ సీటుపై అన్ని పార్టీల కన్ను

సికింద్రాబాద్​ పార్లమెంట్ సీటుపై అన్ని పార్టీల కన్ను

హైదరాబాద్, వెలుగు :  విభిన్న మతాలు, వర్గాలకు వేదికైన సికింద్రాబాద్​పార్లమెంట్​ నియోజకవర్గాన్ని దక్కించుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఈ పార్లమెంట్​ నియోజక వర్గాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు, ఎస్సీలతో  పాటు నార్త్​ ఇండియన్​ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. రైల్వే ఓటర్లు కూడా ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నారు. బీజేపీ సిట్టింగ్​ స్థానమైన లష్కర్​ సీటును కాపాడుకునేందుకు తపన పడుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్​లో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ ​ఎత్తులు వేస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపు అంచుల వరకూ వెళ్లిన బీఆర్ఎస్​ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కనిపించట్లేదు. దీంతో ఈసారి కాంగ్రెస్​, బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం వుంది. 

గత ఎన్నికల్లో ఇలా...

సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో నాంపల్లి, సికింద్రాబాద్, సనత్​నగర్, అంబర్​పేట, ముషీరాబాద్​, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్​అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నాంపల్లి తప్ప మిగిలిన అన్ని చోట్లా బీఆర్ఎస్​ అభ్యర్థులే విజయం సాధించారు. పార్లమెంట్ ​నియోజకవర్గ పరిధిలో 18,93,647 మంది ఓటర్లుండగా 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి 61,766 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్​అభ్యర్థి తలసాని సాయికిరణ్​ యాదవ్​పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కిషన్​రెడ్డికి 3,84,248 ఓట్లు రాగా సాయికిరణ్​కు 3,22,666 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ అంజన్​కుమార్​యాదవ్​కు 1,73,229 ఓట్లు పోలయ్యాయి. 

కిషన్​రెడ్డికి అగ్ని పరీక్ష

సికింద్రాబాద్ ​ఎంపీ, కేంద్ర మంత్రి అయిన కిషన్​రెడ్డికి ఇక్కడ గెలుపు సవాల్​గా మారనున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చోటుచేసుకున్న మార్పుల వల్ల బండి సంజయ్​ అధ్యక్ష స్థానం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన కిషన్​రెడ్డి సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది సీట్లు గెలిచారు. ఆ తర్వాత వస్తున్న లోక్​సభ ఎన్నికలు కావడం, ఇండియా కూటమి ఏర్పడిన నేపథ్యంలో ఎన్ని ఎక్కువ స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి అంత కలిసి వచ్చే అవకాశం ఉండడంతో ఒక్క సీటును కూడా వదులుకోవాలనుకోవడం లేదు. అయితే, కిషన్​రెడ్డిపై ప్రస్తుతం నియోజకవర్గంలోని పార్టీ వర్గాల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన తిరిగి పోటీ చేస్తుండడంతో పార్టీలో ఒక వర్గం ఆయనకు సహకరిస్తుందా? లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, మోదీకి ఉన్న ఛరిష్మా ఈసారి కిషన్​రెడ్డిని గట్టెక్కిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరో అగ్రనేత కె.లక్ష్మణ్ ​రాజ్యసభ సభ్యుడిగా, ఆల్​ఇండియా బీసీ విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్న క్రమంలో కిషన్​రెడ్డి గెలుపునకు ఆయన తన వంతు పాత్ర పోషిస్తే తప్ప గెలుపు సాధ్యం కాదంటున్నారు. నార్త్ ​ఇండియన్​ఓటర్లు కూడా బీజేపీవైపే ఉంటారని, వారిని ప్రసన్నం చేసుకుంటే విక్టరీ పక్కా అంటున్నారు. అలాగే కిషన్​రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడం కలిసి వచ్చే అంశం . 

రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్​

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​అధికారంలోకి రావడంతో మంచి జోష్ ​మీద ఉంది. దీంతో గతంలో చేజారిన ఈ స్థానాన్ని మళ్లీ గెల్చుకుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ లోక్​సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నామని కాంగ్రెస్​ అగ్రనేతల ప్రకటనలు చేస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. రాష్ట్రంలో గెలిచిన తర్వాత కాంగ్రెస్​ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరుగ్యారంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో తామంటే నమ్మకం ఏర్పడిందని, ఈసారి కాంగ్రెస్​ను ఆదరించడం పక్కా అంటున్నారు. ఈ పార్లమెంట్​ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సవాల్​గా తీసుకోవడం, లష్కర్​లో ఆ పార్టీ సీటు గురించి పెద్దగా పోటీ లేకపోవడంతో గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. బీఆర్​ఎస్​లో ఉన్నప్పుడు హైదరాబాద్​ మేయర్​గా పని చేసిన బొంతు రామ్మోహన్ కాంగ్రెస్​లో చేరడంతో ఆయననే ​అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఒక వేళ మహిళా  అభ్యర్థిని బరిలో నిలపాలనుకుంటే బొంతు రామ్మోహన్​ భార్య బొంతు శ్రీదేవి పోటీలో ఉంటారని తెలుస్తోంది. ముస్లిం మైనారిటీల ఓట్లతో పాటు క్రిస్టియన్, బీసీ, ఎస్సీ ఓట్లు తమకే అనుకూలంగా పడతాయన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. రైల్వే ఓటర్లపై దృష్టి పెడితే భారీ మెజారిటీ సాధించవచ్చన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. 

డీలా పడిన బీఆర్ఎస్​

గత ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పోటీకి సై అంటూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ​టికెట్​కోసం ప్రయత్నించిన ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు సైలెంట్​ అయిపోయారు. అప్పట్లో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్​యాదవ్​తన కొడుకు తలసాని సాయికిరణ్​యాదవ్​కు టికెట్ ​ఇప్పించుకున్నారు.  ఆ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చారు. ఒక దశలో గెలుపు ఖాయమనుకున్నా చివరకు బీజేపీనే విజయం సాధించింది. అనూహ్యంగా బీఆర్ఎస్​ అధికారాన్ని కోల్పోవడం, కాంగ్రెస్ పవర్​లోకి రావడంతో సీన్ ​మారింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఈసారి తలసాని సాయికిరణ్ ​యాదవ్ పోటీ చేస్తారని అంటున్నా ఆయన వెనుకడుగు వేస్తున్నట్టు అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల బీఆర్​ఎస్​ఎమ్మెల్యేలే ఉన్నా ఆ పార్టీ నుంచి బరిలో దిగడానికి ఎవరూ సాహసించడం లేదు. దీంతో బీఆర్ఎస్ ​అధిష్టానం డీలా పడిపోయింది. బీఆర్ఎస్​పై ఉన్న వ్యతిరేకత కొనసాగుతుండడం, రాష్ట్రంలో కాంగ్రెస్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు కాంగ్రెస్ ​వైపే మొగ్గు చూపే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.