దేశంలో అతిపెద్ద ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్కు ఈడీ అధికారులు షాకిచ్చారు. జోయ్ అలుక్కాస్ కార్యాలయాల్లో 5 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 305 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. హవాలా ద్వారా భారత్ నుంచి దుబాయ్ కు భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి.. ఆ తర్వాత జోయ్ అలుక్కాస్ వర్గీస్ కు చెందిన జోయ్ అలూక్కాస్ జ్యూవెలరీ LLC దుబాయ్ లో పెట్టుబడి పెట్టింది. జోయ్ అలుక్కాస్ రూ.2,300 కోట్ల ఐపీవో ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
సీజ్ చేసిన వాటిలో రూ. 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే.. రూ. 91.22 లక్షలు ఉన్న 3 బ్యాంకు ఖాతాలు, రూ. 5.58 కోట్ల విలువైన 3 ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ. 217.81 కోట్ల విలువైన జోయ్ అలుక్కాస్ షేర్లను కూడా సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. జోయ్ అలుక్కాస్కు దేశవ్యాప్తంగా 68 శాఖలు ఉన్నాయి. జ్యూయెలరీ బిజినెస్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో బాగా పాపులర్ జోయ్ అలుక్కాస్ 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం విదేశాలకు హవాలా రూపంలో రూ. 300 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంస్థ అధినేత అధికార నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.