
- మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ఎందుకు విచారణ జరపలేదు?: దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: అందాల పోటీలు దేశ సంస్కృతిని కించపరిచేలా జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ అందాల పోటీల నుంచి అవమానకరంగా వైదొలగిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందన్నారు. వేరే దేశంలో ఇలా జరిగి ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారని, కానీ ఇంత పెద్ద ఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తేలుకుట్టిన దొంగల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు." అందరూ ఇండో-పాక్ యుద్ధంపై ఉత్కంఠగా చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీల వైపే మొగ్గు చూపారు. మిస్ ఇంగ్లండ్ అంటే స్టేట్ గెస్ట్తో సమానం. ఆమె విషయంలో సీఎం ఇప్పటికే చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాల్సింది.
కానీ, అందాల పోటీలను కుటుంబ వ్యవహారంగా మార్చారు. రేవంత్ దేశానికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు."మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై హ్యూమన్ రైట్స్ కమిషన్, విమెన్ కమిషన్ సుమోటోగా ఎందుకు స్పందించలేదు? 'భారత్ మాతాకీ జై' అనే హోమ్ మంత్రి బండి సంజయ్ మహిళకు జరిగిన అవమానంపై స్పందించరా? కాంగ్రెస్, బీజేపీల మధ్య బలమైన బంధం ఉంది కాబట్టే బండి సంజయ్ స్పందించలేదా?" అని శ్రవణ్ ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రమోషన్ల కోసం అందాల పోటీలు నిర్వహించారా? కాంగ్రెస్ నేతలు అందాల పోటీల్లో ఎందుకు చొరబడ్డారు? రియల్ ఎస్టేట్ ఓనర్ల చుట్టూ మిస్ వరల్డ్ పోటీదారులు ఎందుకు తిరిగారని ఆయన నిలదీశారు. "మిస్ ఇంగ్లండ్ వ్యవహారంపై ఆర్టీఐ కింద దరఖాస్తు చేశాం. వాస్తవాలు బయటకు వచ్చే దాకా పోరాటాన్ని ఆపం. సోనియా, ప్రియాంక గాంధీలు కూడా ఈ ఘటనపై స్పందించాలి" అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.