గల్లాపట్టి గ్యారంటీలు అమలు చేయిస్తం : కేపీ వివేకానంద్​

గల్లాపట్టి గ్యారంటీలు అమలు చేయిస్తం : కేపీ వివేకానంద్​
  • రేవంత్ ​ట్రాప్​లో బీఆర్ఎస్​ పడదు: కేపీ వివేకానంద్​
  • రేవంత్​ రెడ్డి రివెంజ్​ రెడ్డి అయ్యిండు: దాసోజు శ్రవణ్​

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్, కేటీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​అన్నారు. రేవంత్​ట్రాప్​లో బీఆర్ఎస్​ పడదని, గల్లా పట్టుకుని గ్యారంటీలను అమలు చేయిస్తామని హెచ్చరించారు. ఇతరుల చావును కోరుకునే వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్​ స్పీచ్ ​ఉండడం లేదని తెలిపారు. శనివారం ఆయన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​తో కలిసి తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

రేవంత్ ​వాడే భాష.. గల్లీ లీడర్ కూడా మాట్లాడరని విమర్శించారు. ఆయన బూతుల భూతంలా తయారయ్యారని మండిపడ్డారు. ​ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​మాట్లాడుతూ..పగ కోసమే తాను సీఎం అయినట్లు రేవంత్​రెడ్డి చెప్పుకుంటున్నారని తెలిపారు. రేవంత్​ రెడ్డి రివెంజ్​ రెడ్డిగా మారారని చెప్పారు.కక్షతో పాలన చేస్తున్నకు రేవంత్ సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. కేసీఆర్ మానసికంగా గట్టివాడని, తెలంగాణ కోసం తిరిగి ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు.  కానీ, రేవంత్​ మాత్రం కిందపడితే పైకి లేవలేడన్నారు. రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ, పదవి, దోపిడీపై మాత్రమే ప్రేమ ఉందని దాసోజు పేర్కొన్నారు.