చిన్నారి బాధితులకు అండగా మిషన్​ వాత్సల్య.. 18 ఏండ్లు వచ్చేవరకు నెలకు రూ.4వేల సాయం

చిన్నారి బాధితులకు అండగా మిషన్​ వాత్సల్య.. 18 ఏండ్లు వచ్చేవరకు నెలకు రూ.4వేల సాయం
  • 18 ఏండ్లు వచ్చేవరకు నెలకు రూ.4వేల సాయం
  • కానీ స్కీంపై అవగాహన కరువు
  • ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో అందుకుంటున్నది 38 మంది మాత్రమే

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయి,  సింగిల్​ పెరెంట్స్​గా ఉన్న పిల్లలతోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నావారు చాలా మంది ఉన్నారు. వారికి అండగా కేంద్ర ప్రభుత్వం ‘మిషన్​ వాత్సల్య స్పాన్సర్​ షిప్​ స్కీం’ను అమలు చేస్తోంది.   కానీ దానిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఆ ప్రోత్సాహకం వారు అందుకోలేకపోతున్నారు. జిల్లాలో మొత్తం 8 లక్షల జనాభా ఉంటే అందులో  18 ఏండ్లలోపు చిన్నారులు 2 లక్షల(25 శాతం) మంది ఉన్నారు. వీరిలో తల్లిదండ్రులను లేదా సింగిల్​ పేరెంట్​ను  కోల్పోయిన చిన్నారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావారు, దివ్యాంగులు ఉన్నారు. 

సాయంగా ‘మిషన్​ వాత్సల్య’  

ఇలాంటి చిన్నారుల కోసం కేంద్ర శిశు సంక్షేమ శాఖ ‘మిషన్​​వాత్సల్య స్పాన్సర్​ షిప్​ స్కీం’ అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా అర్హులైన చిన్నారులకు 18 ఏండ్లు వచ్చేంతవరకూ ప్రతినెలా రూ. 4 వేలు సాయంగా అందిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఏటా రూ. 92 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేలు ఆదాయం కలిగిన వారే అర్హులు. 18 ఏండ్లు వచ్చేంత వరకూ స్కీంలో లబ్ధిదారులుగా ఉంటారు. ఆ తర్వాత ఆటోమెటిక్​గా స్కీం నుంచి తొలగించేస్తారు. ఈ స్కీంలో అప్లయ్​ చేసుకోవడానికి డెడ్​లైన్​ అంటూ ఏమీలేదు. నిరంతర ప్రక్రియ. లబ్ధిదారుల సంఖ్యలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు ఉంటాయి.

కానీ అవగాహనే లేదు... 

ఈ స్కీం 2011 నుంచి అమలవుతున్నా పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో లబ్ధిదారులైన చిన్నారుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ స్కీంలో ప్రస్తుతం  జిల్లా వ్యాప్తంగా 38 మంది మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారు. ఇటీవలే ఈ స్కీం గురించి ప్రచారం పెరుగుతుండటంతో అప్లికేషన్ల సంఖ్య పెరుగుతోంది. యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి నేతృత్వంలో ఐదుగురు మెంబర్లతో కూడిన స్పాన్షర్​షిప్​ కమిటీ దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేస్తోంది. వారి జాబితాను స్టేట్​ గవర్నమెంట్​కు, అనంతరం సెంట్రల్​ గవర్నమెంట్​కు రిపోర్ట్​ పంపిస్తోంది. 

తల్లి సంరక్షణలోనే ఎక్కువ మంది

సింగిల్​ పేరెంట్​సంరక్షణలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం 1702 మంది సింగిల్​ పేరెంట్​ ఉన్న చిన్నారలుండగా, ఎక్కువ మందికి తల్లి మాత్రమే ఉంది.  మగవారిలో మద్యానికి బానిసలై, అనారోగ్యానికి గురై చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో చిన్నారుల భవిష్యత్​ కొంత ఆందోళనకరంగానే సాగుతోంది.

2600 దరఖాస్తులు..

యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు మిషన్​ వాత్సల్య స్పాన్సర్​ షిప్​ స్కీంకు 2600 మంది చిన్నారులు అప్లయ్​ చేసుకున్నారు. వీరిలో ఇన్​కం ఎక్కువగా ఉన్న కారణంగా 708 మంది చిన్నారులను అనర్హులుగా తేల్చారు. 
మిగతా 1892 మంది గురించి ఐసీడీఎస్​ ద్వారా ఎంక్వైరీ జరుగుతోంది. వీరిలో తల్లిదండ్రులు లేని అనాథలు 175 మంది ఉన్నారు. సింగిల్​ పేరెంట్​ ఉన్నవారు 1702 మంది  చిన్నారులు ఉన్నారు. హెచ్​ఐవీ బాధితులు 13 మంది,ఇద్దరు దివ్యాంగులు  ఉన్నారు.

మిషన్​ వాత్సల్య  నిరంతరం సాగుతుంది

కేంద్రం అమలు చేస్తున్న మిషన్​ వాత్సల్య స్పాన్షర్​షిప్​ స్కీం నిరంతరంగా సాగుతుంది. బాధిత చిన్నారులు ఎప్పటికప్పడు అప్లయ్​ చేసుకోవచ్చు. అర్హులైన పిల్లలకు ఈస్కీంలో 18 ఏండ్లు వచ్చేంత వరకూ లబ్ధి పొందుతారు.

 సైదులు, డీసీపీవో, యాదాద్రి జిల్లా