- తమ్మిడికుంట, సున్నం చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా అభివృద్ధి చేస్తున్న మరో మూడు చెరువులను సెప్టెంబర్ నెలాఖరులోపు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్రమణలతో 52.30 ఎకరాలకు పరిమితమైన ఉప్పల్ నల్ల చెరువును హైడ్రా 67.31 ఎకరాలకు విస్తరించింది. చుట్టూ 2.4 కిలోమీటర్ల బండ్, వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేసింది. ఈ చెరువుతోపాటు తమ్మిడికుంట, సున్నం చెరువులను ఈ నెలాఖరులోపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మాదాపూర్లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. తమ్మిడికుంట చెరువుకు సమీపంలోని మెటల్ చార్మినార్ వైపు ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వేరు చేసే యూనిట్లతో కాలుష్య ముప్పు ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరించిన నేపథ్యంలో.. వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. సున్నం చెరువు బండ్పై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కృష్ణకాంత్ పార్కులోని చెరువును పరిశీలించారు. రెండో విడతలో అభివృద్ధి చేస్తున్న 14 చెరువుల్లో ఇది ఒకటని తెలిపారు.
