భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
  • విపత్తుల్లో తీసుకునే చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం

నిర్మల్, వెలుగు: జిల్లాలో వర్షాలు, వరదల వల్ల ప్రజల ప్రాణాలు, ఆస్తులు కోల్పోకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఫ్లడ్ మాన్యువల్ పై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. విపత్తుల నిర్వహణ కేవలం స్పందనకే పరిమితం కాకుండా.. ప్రమాదాల నివారణ, తీవ్రత తగ్గింపు, పునరావాసం, పునర్నిర్మాణంపై ప్రణాళికతో మందుకు సాగాలన్నారు. నదులు, వాగులు, కుంటల్లో నీటి ప్రవాహ మార్గాలను శుభ్రం చేయాలని, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని, పాడైన రహదారులకు వెంటనే రిపేర్లు చేయాలని ఆదేశించారు. 

రిజర్వాయర్ల గేట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు, గోదావరి పరివాహక గ్రామాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారులు, విద్యుత్ శాఖ, మీడియాకు సమగ్ర సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, ఆర్డీవో రత్నకల్యాణి, రెవెన్యూ, విద్యుత్, ఫైర్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.