
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ కాంగ్రెస్లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. బంజారాహిల్స్ లేక్ వ్యూలో శనివారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. విజయారెడ్డి ఆలస్యంగా సమావేశానికి రాగా, ఆమె అనుచరుడు మాట్లాడుతుండగా, దానం అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయారెడ్డి తన అనుచరులు మాట్లాడుతుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని ఫైరయ్యారు. సభపై ఉన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం విజయారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
విజయారెడ్డి వర్గీయులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేయగా, అందుకు దీటుగా దానం వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో పోటాపోటీ నినాదాలతో సభ మార్మోగింది. ఒకరి నొకరు తోసుకుంటూ సభ వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయి జారుతుందని గమనించిన ఖైరతాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఇరువర్గాలను శాంతింప చేశారు. పార్టీలో స్వల్ప విభేదాలు సహజమని విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ అంతా కలిసి పార్టీ అభివృద్ధికి పాటుపడుతామని అనంతరం రోహిన్ రెడ్డి మీడియాకు వివరించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కష్టపడ్డ వారికి అవకాశం కల్పిస్తామన్నారు.