దళితబంధు హుజురాబాద్ ఉప ఎన్నిక బిస్కెట్ మాత్రమే

దళితబంధు హుజురాబాద్ ఉప ఎన్నిక బిస్కెట్ మాత్రమే
  • బీజేపీ నేత, మాజీ మంత్రి బాబు మోహన్

హైదరాబాద్: దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో విసిరిన బిస్కెట్ మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ పేర్కొన్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వడగండ్ల వాన కురిసినట్లు కేసీఆర్ హామీలు కురిపిస్తారని.. హామీలు ఇచ్చి మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాయితీ అని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీమంత్రి బాబు మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నికల బిస్కెట్ మాత్రమేనని, గతంలో సాగర్ లోనూ బిస్కెట్ వేసిండని గుర్తు చేశారు. ఇప్పుడు సాగర్ కు వెళ్లినా మళ్లీ బిస్కెట్ లు వేసివస్తారు తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చరని, ఇది న్యాయమా అని ఆయన నిలదీశారు. ప్రగతి భవన్ బంగారం అవుతోంది... ప్రజలు మాత్రం మట్టి పాలైతున్నారని బాబు మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. 
కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ,బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టి రేపు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బడుగుల మహా ధర్నా కార్యక్రమం చేస్తున్నామని బాబుమోహన్ తెలిపారు. బడుగుల ధర్నాను అందరు విజయవంతం చేయాలని ఆయన కోరారు. హుజురాబాద్ లో గెలవడానికి కేసీఆర్ ..చాలా దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఈటల రాజేందర్ బామ్మర్ది పేరు మీద ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు.