
- కాలేజీల స్లైడింగ్ విధానానికి స్వస్తి
- ఫస్ట్ ఫేజ్లో 92శాతం సీట్లు భర్తీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో(డీఈఈసెట్) అడ్మిషన్ల ప్రక్రియ ఇకపై పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరగనుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్లో స్లైడింగ్ విధానాన్ని రద్దు చేయడంతోపాటు డీఈఈసెట్ ర్యాంకులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరిపేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో సెకండ్ ఫేజ్లో మెరిట్కు సంబంధం లేకుండా స్లైడింగ్ విధానంతో సీట్ల కేటాయింపు జరిగేది. దీనిలో ఫస్ట్ ఫేజ్లో సీటు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చి తర్వాతే మిగిలిన వారికి సీట్లు కేటాయించేవారు.
ఈ విధానం మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు రావడంతో ఈ ఏడాది స్లైడింగ్ విధానాన్ని తొలగించారు. ఈ మేరకు డీఈఈసెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి, పాత విధానాన్ని ఎత్తేశారు. సెకండ్ ఫేజ్లోనూ మెరిట్ ఆధారంగానే సీట్లను కేటాయించనున్నట్టు ప్రకటించారు. అయితే, ఇదే ఇష్యూను గతేడాది ‘డీఈఈసెట్ అడ్మిషన్లలో ఇష్టారాజ్యం’ పేరుతో 'వెలుగు' బయటకు తీసిన విషయం తెలిసిందే.
కాగా, గత నెల 25న డీఈఈసెట్ఎగ్జామ్ నిర్వహించగా..26,442 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 19,909 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అటెండ్ అయ్యారు. వారిలో 19,169 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అయితే, 69 కాలేజీల్లో 3,750 కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3,462 (92.32%)మందికి సీట్లు అలాట్ అయ్యాయి.