కొద్దిరోజులుగా వరుస ప్రమాద ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇవాళ (octobar 28) మంగళవారం ఎయిర్ ఇండియా విమానానికి కొద్దీ మీటర్ల దూరంలో ఆపి ఉంచిన, ఎయిర్ ఇండియా SATS ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బస్సు ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. అలాగే విమానానికి కూడా ఎటువంటి నష్టం జరగలేదు.
అయితే బస్సు మంటల్లో చిక్కుకున్న వీడియోలు ప్రస్తుతం బయటికొచ్చాయి. కాలిపోతున్న బస్సుకు కొద్ది దూరంలోనే విమానం స్పష్టంగా కనిపిస్తుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఎయిర్ ఇండియా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) కార్యకలాపాలకు బాధ్యత వహించే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) దీనిని ఉహించని సంఘటనగా తెలిపింది.
ఈ బస్సు ఈరోజు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుంది. వెంటనే రంగంలోకి దిగిన ARFF బృందం వెంటనే చర్యలు తీసుకుని రెండు నిమిషాల్లోనే మంటలను ఆర్పింది. సంఘటన జరిగిన సమయంలో బస్సు ఖాళీగా ఉంది. దింతో ఎటువంటి గాయాలు/ప్రాణనష్టాలు జరగలేదు. అన్ని విమాన కార్యకలాపాలు ఎప్పటిలాగే సాధారణంగానే కొనసాగుతున్నాయి. మా ప్రయాణీకులు, సిబ్బంది భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది అని ఎయిర్ ఇండియా పోస్ట్ చేసింది.
ఢిల్లీ విమానాశ్రయంలో మూడు టెర్మినల్స్, నాలుగు రన్వేలు ఉన్నాయి, ఇవి సంవత్సరానికి 10 కోట్లకుపైగా ప్రయాణీకులకి సేవలు అందిస్తున్నాయి. 2010లో ప్రారంభించిన టెర్మినల్ 3, ప్రపంచంలోని అతిపెద్ద టెర్మినళ్లలో ఒకటి అలాగే ప్రతి ఏడాదికి 40 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించే సామర్ధ్యం ఉంది.
