- ప్రొఫెసర్ హరగోపాల్
బషీర్బాగ్, వెలుగు: బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగాల్సిన విప్లవ రచయితల సంఘం(విరసం) ఆవిర్భావ దినోత్సవ సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదని, ఇది భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కీలుబొమ్మగా మారిందని, విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విరసం కార్యదర్శి రివేరా, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
