ఖమ్మం టౌన్, వెలుగు: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. విద్యా రంగంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.200 కోట్ల చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు.
మధిర ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు లభించాయని తెలిపారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనం పూర్తి చేశామని, వైరా, కూసుమంచి, తిరుమలాయపాలెంలో ఆస్పత్రుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 1,38,790 ఎకరాలకు సాగునీరు అందించనున్నామని, మున్నేరు వరదల నియంత్రణకు ఖమ్మం నగరంలో రూ.525.36 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం ఖమ్మం ఐడీఓసీ మీటింగ్ హాల్లో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను డిప్యూటీ సీఎం, కలెక్టర్ అందజేశారు.
