
- రాజాసింగ్ది పార్టీ అంతర్గత అంశం: డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన నడుస్తోందని, అవినీతి చైన్ సిస్టమ్ కొనసాగుతోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. 30 శాతం పర్సెంటేజీ చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయని, ముఖ్య నాయకుల కుటుంబాలు అవినీతిలో ఉన్నాయని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు ముడుపులు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణను దోచుకోవడం ఆపి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, గోషామహల్, మలక్పేట, ఓల్డ్ సిటీ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తల ఫిర్యాదులను స్వీకరించారు.
కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు ఐదు డీఏలు అడిగితే ఒక్క డీఏ మాత్రమే ఇచ్చారని, ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని చెప్పారు. ఒక్క డీఏ ఇచ్చినందుకు పాలాభిషేకాలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. మిగిలిన పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందన్నారు. మహబూబ్నగర్ అభివృద్ధిపై సీఎం దృష్టి పెట్టాలని, అలంపూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజాభిప్రాయం సేకరించాలని కోరారు. పాలమూరు-, రంగారెడ్డి ప్రాజెక్ట్ డీపీఆర్పై రివ్యూ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ విషయం పార్టీ అంతర్గత అంశమని, రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా లేదని అరుణ పేర్కొన్నారు.