
- కాళేశ్వరం దోపిడీ బయటపడడంతో మామా అల్లుడు పరేషాన్
- రూరల్ ఎమ్యెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్, వెలుగు : ఇటీవల మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్కు చోటు లభించకపోవడం అన్యాయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి విన్నవించానని, మిగిలిన మూడు మినిస్టర్ పోస్టుల్లో ఒకటి పక్కాగా జిల్లాకు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. శుక్రవారం ఆయన డీసీసీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుఅక్రమాలు బయటపడడంతో మామా, అల్లుడు (కేసీఆర్, హరీశ్రావు) ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, సహనం కోల్పోయిన కేటీఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. జ్యుడీషియల్ విచారణ ఎదుర్కొంటున్న మామా, అల్లుడికి తప్పక శిక్ష పడుతుందన్నారు.
అవినీతి పాలనను గమనించే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని, అప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత మానసికంగా కుంగిపోయారని, ఇప్పుడు కుటుంబ కలహాలు షురూ అయ్యాయన్నారు. సీఎం రేవంత్రెడ్డిని చులకన చేస్తూ నోటికొచ్చినట్లు కామెంట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, నరేశ్, సంతోష్, వేణురాజ్, ఆది ప్రవీణ్ తదితరులు ఉన్నారు.