
2 డీజీ పేరుతో డెవలప్ చేసిన సంస్థ
అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
వేగంగా కోలుకుంటున్న పేషెంట్లు
తగ్గుతున్న ఆక్సిజన్ అవసరం
న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న టైమ్ లో పేషెంట్లకు ట్రీట్ మెంట్ కోసం ఓ సరికొత్త మందును డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తీసుకొచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలసి డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ డెవలప్ చేసిన ఈ డ్రగ్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శనివారం అనుమతి ఇచ్చింది. దీనికి 2- డి–అక్సీ -డి-గ్లూకోజ్ (2-డీజీ)గా పేరు పెట్టారు. ఇది సాచెట్లలో పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి.
వైరస్ ఉన్న కణాల్లోకి చేరి..
తక్కువ నుంచి తీవ్రమైన లక్షణాలున్న పేషెంట్లకు ఈ మందు బాగా పని చేస్తుందని, పేషెంట్లు వేగంగా కోలుకోవడంతో పాటు ఆక్సిజన్పై అధారపడటాన్ని తగ్గిస్తుందని డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. గ్లూకోజ్ రూపంలోఉండే 2-డీజీ మందును దేశంలో ఈజీగా ఉత్పత్తి చేయొచ్చంది. వైరస్ వ్యాపించిన భాగాల్లోకి ఈ డ్రగ్ చేరి అక్కడి కణాల్లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు వైరస్ వ్యాప్తిని బాగా తగ్గిస్తుందని వివరించింది. సాధారణ ట్రీట్మెంట్తో పోలిస్తే ఈ డ్రగ్ తీసుకున్న వాళ్లు రెండున్నర రోజుల ముందే కోలుకున్నట్టు ట్రయల్స్లో తేలిందని తెలిపింది.
కిందటేడాది నుంచే ట్రయల్స్
కిందటేడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని సీసీఎంబీ సహకారంతో డీఆర్డీవో సైంటిస్టులు ఈ డ్రగ్ ప్రయోగాలు మొదలుపెట్టారని డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పింది. సార్స్-కోవి-2 వైరస్పై ఇది బాగా పనిచేస్తుందని, వైరస్ పెరుగుదలను అడ్డుకుంటుందని క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైందని వివరించింది. ఆ తర్వాత 2-డీజీ రెండో దశ ట్రయల్స్ 2020 మే నెల నుంచి అక్టోబర్ వరకు 11 హాస్పిటళ్లలోని 110 మంది పేషెంట్లపై జరిగాయని, దీన్ని తీసుకున్న కరోనా పేషెంట్లు త్వరగా కోలుకున్నారని వెల్లడించింది.