అనాథల స్థితిగతులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

అనాథల స్థితిగతులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
  • కరోనా కారణంగా అనాథలైన పిల్లల వివరాల సేకరణ
  • కొన్ని జిల్లాల్లో కేసులు ఎక్కువ నమోదు అవుతుండడంపై కేబినెట్ లో చర్చ

హైదరాబాద్: రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో సభ్యులుగా మంత్రులు, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ ఉంటారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి,  అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులపై కేబినెట్ లో చర్చ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితి పై  కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. దేశంలో పలు రాష్ట్రాల పరిస్థితి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతుల పై కేబినెట్ చర్చిస్తోంది. 
కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఎందుకొస్తున్నాయ్..
తెలంగాణ  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి వైద్యాధికారులు సవివరంగా కేబినెట్ కు సమాచారం అందించారు. ఈ జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సీజన్, మందులు, బెడ్స్, తదితర ఔషదాల లభ్యతపై విపులంగా కేబినెట్ లో చర్చ జరుగుతోంది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు కేబినెట్ ఆదేశించింది. ఈక్రమంలో కొత్తగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పన పై కేబినెట్ చర్చిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావలసిన నిర్మాణాలను చేపట్టాలని, వసతులను సత్వరమే ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది.