
Mumbai Realty: మెట్రో నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల వచ్చిన సంచలన నివేదిక ప్రకారం ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనటం కలగానే మిగిలిపోతుందని తెలుస్తోంది. నెలకు రూ.10 లక్షలకు పైనే సంపాదిస్తున్న వారు సైతం ఏళ్ల పాటు డబ్బు దాచుకోవాల్సిందేనని నేషనల్ హౌసింగ్ బోర్డ్ డేటా ప్రకారం వెల్లడైంది.
సగటు సైజ్ ఉన్న ఇల్లు కొనాలన్నా ముంబైలో అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు 109 ఏళ్ల పాటు డబ్బు దాచుకోవాల్సి ఉంటుందని నివేదించబడింది. ఈ స్టడీలో ప్రజలు తమ ఆదాయంలో 5 శాతం డబ్బును దాచుకుని కనీసం 1184 చదరపు అడుగుల ఇంటిని కొనుక్కోవటానికి పట్టే కాలాన్ని లెక్కించబడింది. ఇదే క్రమంలో గురుగ్రామ్, హర్యాణా వంటి పెద్ద నగరాల్లో కనీసం 64 ఏళ్ల పాటు డబ్బు దాచుకోవాల్సి ఉంటుందని నివేదించబడింది. ఇక ఐటీ రాజధాని బెంగళూరులో 36 ఏళ్లు, దేశరాజధాని దిల్లీలో 35 ఏళ్లు, చండీఘడ్ నగరంలో 15 ఏళ్లు సంపాదనను దాచుకోవాల్సి ఉంటుందని NHB రిపోర్ట్ పేర్కొంది.
ALSO READ | Gautam Adani: ఆపరేషన్ సిందూర్లో అదానీ గ్రూప్ కీలక పాత్ర.. గాల్లోనే శత్రువుపై విధ్వంసం..
అయితే ఈ రిపోర్టుపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ముంబైలో చాలా మంది సగటున ఏడాదికి రూ.15 నుంచి రూ.20 లక్షలు సంపాదిస్తున్నారని.. గురుగ్రాములో కూడా ఆదాయాలు భారీగానే ఉన్నాయని కానీ రిపోర్టు తప్పుడు గణాంకాలను చూపిస్తోందని ఒక యూజర్ పేర్కొన్నారు. మరికొందరు ముంబైలో సంపాదించేవారు సైతం సొంతిల్లు కొనుక్కోలేకపోవటం ఆశ్చర్యకరం అని అన్నారు.
అయితే ప్రముఖ సంస్థ అనరాక్ గత నవంబరులో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో లగ్జరీ నివాసాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతున్నట్లు తేలింది. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ తన నివేదికలో.. న్యూదిల్లీ, ముంబైతో సహా టాప్ 7 నగరాల్లో సగటు ఇంటి ధర ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఏడాది ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.1.23 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇక్కడి నగరాల్లో విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేయటం పెరగటమే ధరల పెరుగుదలకు కీలక కారణాల్లో ఒకటిగా వారు చెబుతున్నారు. హైదరాబాదులో కూడా ఇళ్ల ధరలు 37 శాతం పెరిగినట్లు అనరాక్ నివేదించింది.