నాగ్పూర్ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ ఇచ్చిన ఏడు గ్యారంటీలను దేశ ప్రజలు తిరస్కరించారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనే ఒకే ఒక్క హామీ మాత్రమే తమకు సరిపోతుందని నిరూపించారని ఆయన పేర్కొన్నారు. శనివారం నాగ్పూర్లో జరిగిన మహారాష్ట్ర బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఫడ్నవీస్ పాల్గొని మాట్లాడారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) కలిసి పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ప్రతి ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. “మేము కచ్చితంగా గెలుస్తాం. మరోసారి మోదీకే దేశ పగ్గాలను అప్పగించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు” అని ఫడ్నవీస్ చెప్పారు.