మూడో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టిందని పసిబిడ్డను కొట్టి చంపిన తండ్రి

మూడో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టిందని పసిబిడ్డను కొట్టి చంపిన తండ్రి

కాగజ్ నగర్, వెలుగు: మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని ఆగ్రహంతో ఓ తండ్రి తన నెల రోజుల పసిబిడ్డను కిరాతకంగా రాయితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో సోమవారం రాత్రి జరిగింది. రూరల్​సీఐ రాజేంద్ర ప్రసాద్​ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్​నగర్ మండలం లైన్ గూడకు చెందిన మెస్రం బాబురావు, కమలాబాయి భార్య భర్తలు. బాబురావు కూలి పని చేస్తుంటాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలుండగా, 37 రోజుల కింద కమలాబాయికి మరో ఆడబిడ్డ పుట్టింది. మగ బిడ్డ కోసం ఆశ పెట్టుకున్న బాబురావు తన భార్య మూడో కాన్పులోనూ ఆడ శిశువుకు జన్మనివ్వడంపై నిరాశ చెందాడు. తాగుడు అలవాటు ఉన్న బాబురావు సోమవారం తాగి ఇంటికి వచ్చాడు. సాయంత్రం భార్యతో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి ఆమెను కొట్టాడు. ఆమె తప్పించుకొని బయటకు పరిగెత్తగా వెంబడించాడు. చివరికి ఆమె ఊరి పెద్దమనుషులకు గోడు వెళ్లబోసుకుంది. దాన్ని సహించని బాబురావు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పసిబిడ్డను బయటకు తెచ్చాడు. పాపను చంపేస్తానని బెదిరించాడు. భార్య బతిలాడినా వినకుండా మత్తులో పసిబిడ్డ తలపై రాయితో కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో పసికందు చనిపోయింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.