
- ఉమ్మడి జిల్లాలో 63,750 టన్నుల పంపిణీకి చర్యలు
- లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు
జనగామ, వెలుగు : పేదలకు అందజేసే సన్నబియ్యం మూణ్నెళ్ల రేషన్ పంపిణీ ముగింపు దశకు చేరింది. ఈనెల 1వ తేదీ నుంచి షురూ అయిన ఈ ప్రక్రియ రేపటితో క్లోజ్కానుంది. జూన్, జులై, ఆగస్టు నెలలకు చెందిన బియ్యాన్ని ఒకేసారి అందించడంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 11,24,893 రేషన్ కార్డులు ఉండగా, వీరికి మూడు నెలలకు 63,750 మెట్రిక్టన్నుల బియ్యం పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
మూణ్నెళ్ల కోటా ఒకేసారి..
ప్రభుత్వం వర్షాకాలంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే లక్ష్యంతో మూణ్నెళ్ల బియ్యం కోటా ఒకేసారి అందించాలని చర్యలు చేపట్టింది. జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికతో పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. రేషన్ పోర్టబులిటీతో లబ్ధిదారులు వివిధ ప్రాంతాల్లో బియ్యాన్ని తీసుకున్నారు.
తొలుత లబ్ధిదారుల సంఖ్యకు రేషన్ షాపులకు వచ్చిన నిల్వలకు కాస్త వ్యత్యాసం ఏర్పడింది. ఈ క్రమంలో బియ్యం త్వరగా అయిపోగా సదరు డీలర్లు రెండు, మూడు సార్లు కోటా బియ్యం తెప్పించుకున్నారు. ఈనెల మొదటి 5 రోజులు ఒక్కో లబ్ధిదారుడు ఆరు సార్లు, ఆ తర్వాత మూడు సార్లు థంబ్ వేయాల్సి రావడంతో పంపిణీ మందకొడిగా సాగింది. లబ్ధిదారులు కూడా ఎగబడడంతో కలిగిన ఇక్కట్లు రెండో వారం తదుపరి తగ్గిపోయి పంపిణీ ఊపందుకుంది.
90 శాతం పైగా పంపిణీ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేషన్పంపిణీ 90 శాతం పైగా చేపట్టారు. మరో రెండు రోజుల గడువు ఉండగా మరింత మందికి లబ్ధి చేకూరనుంది. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 4923.101 టన్నులు, వరంగల్ జిల్లాలో 7758.692 టన్నులు, హనుమకొండ జిల్లాలో 6897.210 టన్నులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3646.861 టన్నులు, ములుగు జిల్లాలో 2943.723 టన్నులు, మహబూబాబాద్ జిల్లాలో 7150.505 టన్నుల బియ్యం పంపిణీ చేపట్టారు.
సంతోషంగా ఉంది..
వానల బాధలొద్దని సర్కారు మూణ్నెళ్ల బియ్యం ఒక్కసారే ఇయ్యడం సంతోషంగా ఉంది. మా ఇంట్లో నలుగురం ఉంటం. ప్రతీనెల 24 కిలోల బియ్యం వచ్చేది. ఇప్పుడు మూడు నెలల బియ్యం 72 కిలోలు ఒక్కసారే వచ్చినయ్. అందులోనూ సన్న బియ్యం. మాకు బయట కొనుక్కునే బాధ తప్పింది. సన్న బియ్యం ఇయ్యడం వల్ల ఇంటిళ్లిపాదిమి కడుపు నిండా తింటున్నం. - అన్నెబోయిన బాలరాజు, ఆలింపూర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా
సన్న బియ్యంతో మేలు..
రేవంత్ రెడ్డి సర్కారు సన్నబియ్యం ఇవ్వడం ఎంతో మేలు చేస్తోంది. గతంలో దొడ్డు బియ్యం తినలేక పోయేటోళ్లం. పిల్లలు అన్నం ముట్టుకునేటోళ్లు కాదు. ఇప్పుడు ఆ బాధ తప్పింది. సన్నబియ్యం వండుకుని తింటున్నం. ఏకంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం ఆనందంగా ఉంది.- ఆకుల సంతోషి, చాగల్ గ్రామం, స్టేషన్ ఘన్పూర్ మండలం, జనగామ జిల్లా
ఉమ్మడి జిల్లా వివరాలు..
జిల్లా రేషన్ షాపులు రేషన్ కార్డులు పంపిణీ చేసిన బియ్యం శాతం
జనగామ 335 163282 4923.101 90.79
హనుమకొండ 413 231516 6897.210 98.16
వరంగల్ 500 266694 7758.692 95.73
భూపాలపల్లి 277 125588 3646.861 94.30
మహబూబాబాద్ 558 243204 7150.505 87.32
ములుగు 222 94628 2943.723 93.07