- లోకల్గా ఇన్ఫ్లేషన్ను కట్టడికే పెద్ద పీట
- పండ్ల నుంచి గోధుమ పిండి వరకు చాలా ప్రొడక్ట్ల ఎగుమతులపై బ్యాన్
- తాజాగా గోధుమ ఎగుమతులను నిలిపేసిన ఇండియా
బిజినెస్ డెస్క్, వెలుగు: ధరల పెరుగుదల (ఇన్ఫ్లేషన్) ను కట్టడి చేయడానికి కేవలం ఇండియా మాత్రమే కాదు చాలా దేశాలు ఆహార పదార్ధాల ఎగుమతులపై బ్యాన్ పెట్టాయి. తాజాగా గోధుమల ఎగుమతులను ఇండియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వంటల్లో ఎక్కువగా వాడే పామాయిల్ ఎక్స్పోర్ట్స్పై ఇండోనేషియా బ్యాన్ విధించింది. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, కజకిస్తాన్, టర్కీ, కువైట్, టూనిషియా ..ఇలా చాలా దేశాలు ఫుడ్ ఎక్స్పోర్ట్స్పై బ్యాన్ విధించాయి. గోధుమ, బార్లీ, సన్ఫ్లవర్ ఆయిల్, మొక్క జొన్న వంటి అగ్రీ ప్రొడక్ట్ల ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ దేశాలు గ్లోబల్గా టాప్ 5 లో ఉంటాయి. యుద్ధం వలన గ్లోబల్గా ఈ ప్రొడక్ట్ల సప్లయ్ తగ్గింది. దీంతో అన్ని దేశాల్లోనూ వీటి షార్టేజ్ ఏర్పడి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గిపోవడంతో మన దేశంలో వంటనూనెల ధరలు పెరగడాన్ని చూశాం. అలానే చాలా దేశాలు గోధుమల ఎగుమతులపై బ్యాన్ వేయడంతో గ్లోబల్గా గోధుమల రేటు 14 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ‘కరోనా వలన సప్లయ్ చెయిన్లో సమస్యలు నెలకొనడం, కిందటేడాది కరువు వలన పంటల దిగుబడి తగ్గడం వంటి కారణాలతో ఆహార పదార్ధాల ధరలు ఇప్పటికే పెరగడం చూశాం. గ్లోబల్ ఫుడ్ మార్కెట్ అధ్వాన్న స్థితిలో ఉన్నప్పుడు రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం నెలకొంది’ అని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఎఫ్పీఆర్ఐ) పేర్కొంది.
పత్తి ఎగుమతులపై బ్యాన్?
రికార్డ్ లెవెల్కు చేరుకున్న పత్తి రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం పత్తి ఎగుమతులపై బ్యాన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పత్తి రేట్లు పెరగడంతో దేశంలోని టెక్స్టైల్ ఇండస్ట్రీ నష్టపోతోంది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కాటన్ ఎగుమతులపై బ్యాన్ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఎగుమతిదారులు కొంత తక్కువగా ఎక్స్పోర్ట్ చేయాలని కోరిందని అన్నారు. కామర్స్ మినిస్టర్ పీయుష్ గోయల్, అధికారులు, టెక్స్టైల్ ఇండస్ట్రీలోని ఎగ్జిక్యూటివ్లు పత్తి ఎగుమతుల బ్యాన్పై ఇటీవల చర్చించిన విషయం తెలిసిందే.