
- పాలనమీద పట్టువచ్చేలోపే ట్రాన్స్ఫర్
- 11 ఏండ్లలో 9 మంది బదిలీ
- గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై ఎఫెక్ట్
- వానలు, వరదలు, పెండింగ్ పనులు కొత్త కమిషనర్కు సవాళ్లు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏడాదికో కమిషనర్ బదిలీ అవుతున్నారు. ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితులు, సమస్యలు తెలుసుకుని అడ్మినిస్ట్రేషన్పై పట్టువచ్చి, పాలన గాడిలో పడేలోపే బదిలీ జరుగుతోంది. గడిచిన 11 ఏండ్లలో 9 మంది కమిషనర్లు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ ఎఫెక్ట్ అంతా సిటీ డెవలప్మెంట్ పై పడుతోంది.
ఒక్కరూ రెండేండ్లు పనిచేయలే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఆఫీసర్ కూడా గ్రేటర్ వరంగల్ బల్దియాలో రెండేండ్లు పూర్తిస్థాయిలో పనిచేయలేదు. ఇప్పటివరకు 9 మంది కమిషనర్లు ఇలావచ్చి అలా వెళ్లారు. ఇందులో 8 మంది ఐఏఎస్, ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. మొదట్లో ఐఏఎస్ కమిషనర్గా వచ్చిన సువర్ణ పాండాదాస్ 20 నెలల పాటు జీడబ్ల్యూఎంసీలో పనిచేశారు. ఆపై సర్ఫరాజ్ అహ్మద్ 21 నెలలు, శ్రుతి ఓజా 16 నెలలు, వీపీ గౌతమ్ 10 నెలలు, రవికిరణ్ (నాన్ ఐఏఎస్) 10 నెలలు, పమేలా సత్పతి 18 నెలలు, ప్రావీణ్య 20 నెలలు మాత్రమే చేశారు.
ప్రస్తుతం బదిలీ అయిన కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే గతేడాది వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పనిచేస్తున్న క్రమంలో 2014 మార్చి 14న గ్రేటర్ బల్దియా కమిషనర్గా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆమె 16 నెలలు గడవకముందే బదిలీ బాట పట్టారు.
కమిషనర్ నుంచి కలెక్టర్ ప్రమోషన్లు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనరేట్లో పనిచేసిన కమిషనర్లు విధుల్లో ప్రతిభ చూపుతున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న పెద్ద నగరంలో పనిచేయడం ద్వారా యువ కమిషనర్లు పాలనలో మెరుగైన అనుభవాన్ని సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ను విడిచివెళ్లేవారికి ప్రమోషన్లు దక్కుతున్నాయి. నాడు కమిషనర్గా పనిచేసిన సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ కలెక్టర్ వెళ్లగా, ఇదే బాటలో పమేలా సత్పతి యాదాద్రి కలెక్టర్గా, ప్రావీణ్య వరంగల్, హనుమకొండ కలెక్టర్గా, రిజ్వాన్ భాషా జనగామ కలెక్టర్గా వెళ్లగా, ఇప్పుడు అశ్విని తానాజీ వాఖడే కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా వెళ్లారు.
కొత్త కమిషనర్కు సవాళ్ల స్వాగతం..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీపై వస్తున్న చాహత్ బాజ్పాయ్కి మొదటి ఏడాది పాలన సవాల్గా మారనుంది. బాజ్పాయ్ అటు జీడబ్ల్యూఎంసీ కమిషనర్తో పాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా వ్యవహరించాల్సి ఉంటుంది. మరో వారం, పది రోజుల్లో వానలు పూర్తిస్థాయిలో కురిశాయంటే వరంగల్ నగరాన్ని ఏటా వణికించే ముంపు సమస్య మొదటి చాలెంజ్ కానుంది. స్మార్ట్ సిటీ పనులను గడువులోపు పూర్తి చేయాల్సి ఉంది.
66 డివిజన్ల పరిధిలోని ట్రైసిటీ, విలీన గ్రామాల్లో చెత్త సేకరణా సవాలే. దోమల బెడద, సీజనల్ వ్యాధుల నియంత్రణ చేపట్టాల్సి ఉంది. కాగా, ప్రస్తుత మేయర్ గుండు సుధారాణి పాలకవర్గానికి పాలనపరంగా ఇదే చివరి ఏడాది. ఈ క్రమంలో ప్రస్తుత కార్పొరేటర్లు రాబోయే 9 నెలల్లోనే డివిజన్లలో పూర్తిస్థాయి అభివృద్ధి చూపాల్సి ఉంటుంది. దీంతో పనులు, ఫండ్స్ పరంగా మొదటి ఏడాదిలో కమిషనర్పై 66 డివిజన్ల నుంచి కార్పొరేటర్ల ఒత్తిడి పెరిగే అవకాశముంది. అయితే, కొత్త కమిషనర్కు కరీంనగర్ కార్పొరేషన్ లో పనిచేసిన అనుభవం కొంతమేరకు కలిసిరానుంది.