సెక్యూరిటీ లోపం వల్లే గాంధీ ఆస్పత్రి అత్యాచారం

సెక్యూరిటీ లోపం వల్లే గాంధీ ఆస్పత్రి అత్యాచారం
  • బీజేపీ మహిళా మోర్చా నేత గీతామూర్తి కామెంట్

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్‌ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి కనిపించకపోవడంతో ఆమె కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. బాధితురాలు చెబితే తప్ప అసలేం జరిగిందో వివరించలేమన్నారు. బాధితురాలితో ఇవాళే మాట్లాడతానని.. పూర్తి విచారణ జరిగిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మరో బాధితురాలు ఎక్కడ ఉందో గుర్తించలేదని తెలిపారు. దోషులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది చెప్పారు. చికిత్స కోసం వచ్చిన రోగి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారని తెలిపారు.

ఆస్పత్రిలో అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటని బీజేపీ మహిళా మోర్చా నేత గీత మూర్తి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఆమె చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

గాంధీ ఆస్పత్రిలో తనతో పాటు తన సోదరిపై అత్యాచారం జరిగిందని బాధితురాలు నిన్న( సోమవారం) పోలీసులకు ఫిర్యాదు చేసింది.