
- లాల్ దర్వాజ మహంకాళి ఆలయం నుంచి రానున్న బోనం
- ఇక నుంచి ప్రతి ఏడాది ఇదే సంప్రదాయం..
- ఏర్పాట్లకు సిద్ధమైన అధికారులు, అర్చకులు
- ఈ నెల 22న తొలి బోనం ఎత్తనున్న మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు: కాకతీయుల కాలంలో నిర్మించిన, ఓరుగల్లు ఇలవేల్పు అయిన భద్రకాళి ఆలయంలో తొలిసారిగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి ఆలయ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దాదాపు 400 ఏండ్లుగా హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలోని అమ్మవారికి బోనం ఎత్తుతుండగా, ఈ ఏడాది ఇదే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భద్రకాళి తల్లికి బంగారు బోనం సమర్చించనున్నారు. ఈ నెల 22న దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ హాజరై అమ్మవారికి బోనమెత్తనున్నారు.
ఇక ఏటేటా బోనం..
రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో మహంకాళి ఆలయ ట్రస్ట్ సభ్యులు బంగారు బోనం ప్రత్యేకతను నలుమూలలా చాటాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏటా హైదరాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బోనం ప్రత్యేకత దేశానికి చాటే క్రమంలో దాదాపు ఏండ్లుగా ఢిల్లీలో ఇండియా గేట్, తెలంగాణ భవన్ వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో ప్రధానంగా శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, జోగులాంబ అమ్మవార్లకు బోనం అందిస్తూ వస్తున్నారు. కాగా, ఎంతో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారికి సైతం బంగారు బోనం సమర్పించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో అధికారులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఏడాది ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆ శాఖ తరఫున అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
బోనాలతో భారీ ఊరేగింపు..
భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా బంగారు బోనం సమర్పించనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆఫీసర్ల ఆదేశానుసారం అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆదివారం నిర్వహించే ఉత్సవాల్లో మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తుతుండగా, పాత వరంగల్ సెంట్రల్ జైల్ మెయిన్ రోడ్ వద్దనున్న ఆలయ ప్రధాన ద్వారం నుంచి భారీ ఊరేగింపు జరగనుంది. సాంస్కృతిక శాఖతో పాటు లాల్ దర్వాజ మహంకాళి ఆలయం తరఫున పోతరాజులు, శివసత్తులు విన్యాసాలతో వస్తుండగా, వందలాది మంది మహిళలతో బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రకాళి అమ్మవారికి ఈ ఏడాది నుంచి బంగారు బోనం సమర్పించాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మంత్రి సురేఖతోపాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులైన లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ ట్రస్ట్ కమిటీ ఇక్కడకువచ్చి కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 22న నిర్వహించే ఉత్సవంలో మంత్రి సురేఖ తొలి బోనం ఎత్తుతారు. 200 మంది కళాకారులతో పాటు మహిళలు వందలాది బోనాలతో హాజరుకానున్నారు.
కే.శేషు భారతి, ఆలయ కార్యనిర్వహణాధికారి