గవర్నర్ హక్కులను కేసీఆర్ హరిస్తున్నారు:గోనె ప్రకాష్ రావు

గవర్నర్ హక్కులను కేసీఆర్ హరిస్తున్నారు:గోనె ప్రకాష్ రావు

గవర్నర్లకున్న విచక్షణ అధికారాలను, ప్రజాస్వామ్య హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే , ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. గవర్నర్ ప్రొటోకాల్, అధికారాలపై కేసీఆర్ ప్రభుత్వం  పెత్తనం చెలాయించాలని చూడడం సరికాదన్నారు.  ఎమ్మె్ల్యేల  ఫిరాయింపులు మొదలు అనేక అంశాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం కేసీఆర్కు  గవర్నర్కు ఉన్న విచక్షణ అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిదన్నారు. గవర్నర్ల వ్యవస్థని ప్రభుత్వం శాసించే స్థాయికి చేరుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చెప్పారు. గవర్నర్కు  సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను తెలంగాణ పాలక పక్షం ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. 

కేసీఆర్వి ఒంటెద్దు పోకడలు.
స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలను కేసిఆర్ తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని గోనె ప్రకాశ్ రావు మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా కేసిఆర్ వ్యవహరిస్తూ యూనివర్సిటీల అధికారాలను హరింపజేసి  ఆయా వర్సిటీల్లోని ఉద్యోగాలను కార్యకర్తలతో భర్తీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీల బిల్లుపై గవర్నర్కు సందేహాలు రావడంలో తప్పేముందన్నారు. పాలకపక్షంతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సీఎం కార్యాలయానికి లేఖ రాస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం  సరైనదేనని చెప్పారు. అభ్యంతరాలను నివృత్తి చేసుకోకుండా 5000 ఉద్యోగార్థులతో చెలగాటమాడడం తగదన్నారు.  గవర్నర్కు ఉన్న అధికారాలను పక్కనపెట్టి విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు చేయడం అక్రమం అని ఖండించారు. 

ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించారు..
కాంగ్రెస్ , టిడిపిలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై  ఆయా పార్టీలు శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని గోనె ప్రకాశ్ రావు గుర్తు చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని శాసన సభ స్పీకర్, మండలి చైర్మన్లకు వినతులు ఇచ్చినా... ఇప్పటివరకు నాన్చి ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా  టీఆర్ఎస్ లోకి వచ్చారని కేసీఆర్  ప్రగతి భవన్ లో చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంపై పది రోజుల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.