ఇక నుంచి సర్కారు బడిలో గూగుల్ ప్రేయర్

ఇక నుంచి సర్కారు బడిలో గూగుల్ ప్రేయర్
  • రోజుకు ఐదు స్కూళ్లలో  అమలు 
  • ఉదయం స్టూడెంట్స్ తో మాట్లాడనున్న కలెక్టర్
  • విద్యార్థులు, టీచర్స్ హాజరు శాతంపై ఆరా

నిర్మల్, వెలుగు:  ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు, టీచర్ల హాజరు శాతాన్ని మెరుగుప రిచేందుకు ఎస్ఎఫ్ఆర్ఎస్( స్టూడెంట్స్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్), లైవ్ లొకేషన్ సిస్టమ్ అమలవుతున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. ఎఫ్ఆర్ఎస్ యాప్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్, సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో పాటు  లైవ్ లొకేషన్ లో కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో స్కూళ్లలో మరింత నిఘాను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు టీచర్ల డుమ్మాలకు చెక్ పెట్టేందుకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈనెల17 నుంచి గూగుల్ ప్రేయర్ పేరిట కొత్త విధానం ద్వారా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు జారీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విధానంలో భాగంగా జిల్లా కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల్లో గూగుల్ సహకారంతో వీడియో కాన్ఫరెన్స్ తరహాలో ప్రేయర్ ను పరిశీలించనున్నారు. అదే సమయంలో టీచర్లు, స్టూడెంట్స్ హాజరు శాతాన్ని సైతం తెలుసుకుంటారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 117 ప్రభుత్వ హైస్కూల్స్, 833 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 85 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఉండగా మొత్తం 55,039 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఇప్పటికే కొనసాగుతున్న  ఎస్ఎఫ్ఆర్ఎస్, లైవ్ లొకేషన్   

జిల్లాలోని పాఠశాలల్లో మూడేండ్ల నుంచి టీచర్ల కోసం లైవ్ లొకేషన్ సిస్టమ్, కొద్ది నెలలుగా విద్యార్థుల కోసం ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. ఈ యాప్ లో తరచూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుండడంతో పాటు సిగ్నల్స్ సరిగా రాకపోవడం కూడా  సమస్యగా మారింది. దీన్ని సాకుగా చేసుకుని కొందరు టీచర్లు డుమ్మాలు కొడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.  ఎఫ్ ఆర్ఎస్ లో విద్యార్థుల హాజరులో కూడా తేడాలు వస్తుం డటంతో అనుమానాలు తలెత్తుతు న్నాయి. ఇక నుంచి  కలెక్టర్  గూగుల్ ప్రేయర్ పేరిట విధానం ద్వారా పర్యవేక్షించ నున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా బడుల్లో కలెక్టర్   స్వయంగా తనిఖీలు చేయడమే కాకుండా విధుల్లో నిర్ల క్ష్యంగా ఉన్న టీచర్లకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేశారు.