జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా విలాసాగర్ మానేరు వాగు నుంచి పెద్దపల్లి జిల్లా రూప్ నారాయణపేట వరకు చేపట్టిన హై లెవల్ బ్రిడ్జి పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఆలస్యంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ కు చెందిన సముద్రాల ప్రసాదాచార్యులు ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని మంగళవారం విప్ పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూ.80 కోట్లతో చేపట్లే హై లెవల్ వంతెన పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టర్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. పనలు వేగవంతం చేసి, 18 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, విలాసాగర్ సర్పంచ్ జి.శ్రీధర్, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్ ను సుందరంగా తీర్చిదిద్దుతా
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని విజయ రమణారావు అన్నారు. పట్టణంలోని రోడ్లను మంగళవారం పరిశీలించారు. సుల్తానాబాద్ను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, హనుమాన్ టెంపుల్ నుంచి పోస్టాఫీస్ చౌరస్తా వరకు, రజక నగర్లో ఇంటర్నల్ రోడ్లను విస్తరించి నిర్మించనున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధాకృష్ణ, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్ రావు, కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
