ములుగు, వెలుగు : పేదల సామాజిక గౌరవానికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రతీకగా నిలుస్తున్నాయని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు ఆర్డీవో ఆఫీస్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ములుగు, మల్లంపల్లి మండలాల లబ్ధిదారులకు 2,430 క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని అర్హులైన పేదలకు సన్నబియ్యం పథకం అందించేందుకే కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 12,802 కొత్త రేషన్ కార్డుల ద్వారా 36,405 మందికి సన్నబియ్యం పథకం ప్రయోజనం అందిస్తున్నామన్నారు.
రేషన్ కార్డు వివిధ ప్రభుత్వ సేవలు, ఆరోగ్యశ్రీ తదితర అవసరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గంలో ఇప్పటివరకు 5వేలకు పైగా ఇండ్లు అందించామని, రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, డీసీఎస్వో ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
