ఇందిరమ్మ ఇండ్ల గైడ్​లైన్స్ ఇవే..రిలీజ్​ చేసిన తెలంగాణ సర్కార్

ఇందిరమ్మ ఇండ్ల గైడ్​లైన్స్ ఇవే..రిలీజ్​ చేసిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్  సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది.  జిల్లా ఇన్ చార్జ్  మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడించింది. అలాగే ఆర్థిక సహాయం పంపిణీలో గ్రామ, మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేస్తామని, లబ్ధిదారులను ఎంపిక చేసిన తరువాత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో నిర్వహించే గ్రామ, వార్డ్ సభలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా సొంత జాగా ఉన్న వారికి 100 శాతం సబ్సిడీతో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు  చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొంది. కాగా, ఈ స్కీమ్ ను సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.

ఇవీ గైడ్​లైన్స్ 

    రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు అర్హులు.
    తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం.
    లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్  లోకల్ బాడీలో నివాసితుడై ఉండాలి. అద్దెకు ఉన్నవారు అర్హులే.
    లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్​చార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఫైనల్  చేస్తారు. గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది. 
    400 ఎస్​ఎఫ్​టీల విస్తీర్ణంలో ఆర్​సీసీ పద్ధతిలో ఇండ్లు నిర్మించాలి.
    లబ్ధిదారుల ఎంపిక తరువాత ఆ లిస్టును గ్రామ సభలు, పట్టణాల్లో అయితే వార్డు మీటింగ్​లో ప్రవేశపెడతారు.
    జిల్లా ఇన్​చార్జ్  మంత్రిని సంప్రదించి 
ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్  ఫైనల్  చేస్తారు.

నాలుగు దశల్లో ఆర్థిక సాయం 

    బేస్​మెంట్ లెవల్​కు రూ.1 లక్ష
    స్లాబ్ లెవల్​కు రూ.1 లక్ష
    స్లాబ్ పూర్తయిన తరువాత రూ.2 లక్షలు
    ఇల్లు పూర్తయిన తరువాత రూ.1 లక్ష. కాగా జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదించిన హౌసింగ్  కార్పొరేషన్  ఎండీ  ఫండ్స్ రిలీజ్  చేసి ఆర్థిక  సాయాన్ని డీబీటీ ( డైరెక్ట్  బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ) పద్ధతిలో ఆధార్  పేమెంట్  బ్రిడ్జ్ సిస్టమ్  ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారు.