
కాంగ్రెస్ నాయకుల విందులు, వినోదాల కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్. అందాల పోటీల కోసం ప్రభుత్వ రూ.250 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. అందాల పోటీల్లో రేవంత్ రెడ్డి దగ్గర ఉండే ఇద్దరు దోస్తుల టార్చర్ తట్టుకోలేక.. ఇంగ్లాండ్ కంటెస్టెంట్ పోటీ నుంచి విరమించుకొని మధ్యలో నుంచే ఆమె దేశానికి వెళ్లిపోవడం అవమానకరమన్నారు. అందాల భామల్ని చూడడానికి ఐదు సార్లు పోయిండు రేవంత్ రెడ్డికి.. ఒక్కసారి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు ఆగిపోయాయని రైతుల వద్దకు వెళ్ళడానికి సమయం దొరకలేదా? అని ప్రశ్నించారు.. మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ ..రేవంత్ సర్కార్ వచ్చాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి..పట్టుమని 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగా నడిచేది..కానీ నేడు భూములు కొనేవారు లేరన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈగలు తోలుతున్నారని సెటైర్ వేశారు హరీశ్.
కాంగ్రెస్ నాయకుల పరిస్థితి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్లు ఉందని ఫైర్ అయ్యారు. వెల్ఫేర్ స్కీంలు అమలు చేయమంటే ఉన్న పథకాలుకు ఎసరు పెడుతున్నారని ధ్వజమెతతారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రోడ్లన్నీ గుంతలుగా మారాయని...తట్టెడు మట్టి పోసే పరిస్థితి కూడా లేదన్నారు. పదేండ్లలో కేసీఆర్ తెలంగాణను నిలబెడితే ఏడాదిన్నరలోనే రేవంత్ పడగొట్టిండన్నారు. రాజీవ్ యువశక్తితో కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి జరుగుతుందని విమర్శించారు.