హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111కు విరుద్ధంగా పంక్షన్ హాళ్ల నిర్మాణంపై కౌంటరు దాఖలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా కౌంటరు దాఖలుకు చివరిసారిగా ఒక అవకాశం ఇస్తున్నామని స్పష్టంగా పేర్కొన్నా.. దాఖలు చేయకపోవడం సరికాదంది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు
జరిమానాగా రూ.5 వేలు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి వారంలోగా చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరీవాహకంలో జీవవైవిధ్య పరిరక్షణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. ప్రభుత్వం, స్థానిక సంస్థలు పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలానికి చెందిన మందాడి మాధవరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదిస్తూ..కౌంటరు దాఖలు చేయడానికి మరో రెండు వారాల గడువు కావాలని కోరడంతో బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ. 5 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

