శిశిరంలో ఆకురాల్చుకున్న అడవి తల్లి మోదుగుపూలతో వసంతమాడుతోంది. మిగిలిన చెట్లన్నీ కొత్త చిగుళ్లు తొడుక్కొని ఆకుపచ్చ అందాలతో అలరారుతుంటే.. మధ్య మధ్య మోదుగు చెట్లు మాత్రం ఇలా కాషాయ పూలగుత్తులతో అడవిని వర్ణశోభితం చేస్తున్నాయి.
ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి దాకా రోడ్ల వెంట పలకరిస్తున్న ఈ మోదుగుపూలను చూసి పులకరించని మనసులేదంటే అతిశయోక్తి కాదు. పేదల దేవుడు శివయ్యకు ఇష్టమైనవిగా చెప్పే ఈ గోగుపూలు నేటి కలర్ ఫుల్ హోళీ వేడుకకు సహజ రంగుగా పనికొస్తాయనే సంగతి తెలిసిందే. కానీ, కొన్నేళ్లుగా అడవులు తగ్గిపోవడం, చెల్కలన్నీ పొలాలుగా, రియల్ వెంచర్లుగా మారిపోవడంతో మోదుగుచెట్ల సంఖ్య తగ్గిపోవడంపై పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
