వామ్మో క్లౌడ్ కిచెన్.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో షాకింగ్ నిజాలు.. ఆఫర్స్ వల.. తిని విలవిల

వామ్మో క్లౌడ్ కిచెన్.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో షాకింగ్ నిజాలు.. ఆఫర్స్ వల.. తిని విలవిల
  • ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయిన ఆహార పదార్థాల వాడకం 
  • చాలాచోట్ల అపరిశుభ్ర ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌లు
  • చెత్త మధ్యే ఆహారం తయారీ
  • పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, ఈగలు కామన్​
  • చెక్​పెట్టేందుకు ఆదేశాలు జారీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీలు పెరుగుతుండడంతో క్లౌడ్ కిచెన్ల సంఖ్య కూడా అంతే సంఖ్యలో పెరుగుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్​డెలివరీ ప్లాట్​ఫామ్స్​లో ఈ కిచెన్లకు ఆర్డర్లు పెట్టి ఆహారం తెచ్చుకునే కస్టమర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండడంతో చాలామంది నిర్వాహకులు అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, క్వాలిటీ లేని ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారు.  దీంతో  ఈ కిచెన్ల నుంచి కస్టమర్లకు చేరుతున్న ఆహారం ఎలాంటి పరిస్థితుల్లో తయారవుతోందో తెలుసుకునేందుకు తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారుల పలు చోట్ల తనిఖీలు చేయగా ఆందోళనకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఏమిటీ క్లౌడ్​ కిచెన్​? 


కేవలం ఫుడ్​వండడానికి, డెలివరీ చేయడానికి మాత్రమే క్లౌడ్​కిచెన్​ను ఉపయోగిస్తారు. దీన్ని ఘోస్ట్ కిచెన్ లేదా డార్క్ కిచెన్ అని కూడా అంటారు. ఈ హోటళ్లలో కస్టమర్లు కూర్చుని తినడానికి స్థలం లేదా టేబుల్స్ ఉండవు. కస్టమర్లు కేవలం స్విగ్గీ , జొమాటో, హోటల్ సొంత యాప్, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేస్తారు. టేబుల్స్, కుర్చీలు, వెయిటర్లు, పెద్ద ప్రైమ్ లొకేషన్లలో స్థలం అవసరం లేదు కాబట్టి పెట్టుబడి చాలా తక్కువ. ఇక్కడ కేవలం ఆర్డర్లను స్వీకరించి, ఆహారాన్ని వండి ప్యాక్ చేసి డెలివరీ బాయ్స్‌‌‌‌‌‌‌‌కు అప్పగిస్తారు. ఒకే వంటగది నుంచి వేర్వేరు బ్రాండ్స్​పేర్లతో బిర్యానీ, పిజ్జా, చైనీస్ వంటి వివిధ రకాల ఆహారాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో విక్రయిస్తారు. దీంతో చాలామంది ఈ క్లౌడ్​కిచెన్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

ఆఫర్స్ ​వల.. తిని విలవిల  

సిటీలో హోమ్ ఆధారిత చిన్న కిచెన్లతో పాటు రోజుకు వేలాది ఆర్డర్లు సిద్ధం చేసే కమర్షియల్​క్లౌడ్ కిచెన్లు వెలిశాయి. తక్కువ ధరకే ఫుడ్ అని స్విగ్గి, జొమాటో లాంటి ఫుడ్​డెలివరీ యాప్స్​లో బంపర్ ఆఫర్లు ఇస్తుండడంతో కస్టమర్లు ఎగబడి మరీ ఆర్డర్లు ఇస్తున్నారు. కానీ, ఎక్కడ తయారైన, ఎట్లాంటి ఆహారం వస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫుడ్​సేఫ్టీ అధికారులు మూడు కార్పొరేషన్ల పరిధిలో రైడ్స్ చేయగా, ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ అయిన ఆహార పదార్థాలు వాడడం, సరైన టెంపరేచర్​లో చికెన్, మటన్​నిల్వ చేయకపోవడం, లేబులింగ్ లేని ఫుడ్​ఐటమ్స్,  అపరిశుభ్రమైన ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌లు, చేతులు కడుక్కునే సదుపాయం లేని కిచెన్లు, చెత్త మధ్యే ఆహారం తయారు చేయడం వంటి లోపాలు బయటపడ్డాయి. కొన్ని కిచెన్లలో పిల్లులు, ఎలుకలు తిరుగుతూనే ఉన్నాయి. ఇక ఈగలు, బొద్దింకల సంగతి సరేసరి..కొన్ని ఫుడ్​ఐటమ్స్​లో వాటి మలం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రెండు క్లౌడ్​కిచెన్ల లైసెన్సులను
 రద్దు చేశారు.  

  • రేటింగ్స్​ మారిస్తే యాక్షన్​ 

అలాగే, కస్టమర్లు ఇచ్చిన నెగటివ్ రివ్యూలను తొలగించడం, మార్చడం లేదా రేటింగ్స్‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేసే చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తించి వాటిపై వివరణ ఇవ్వాలని స్విగ్గీ, జొమాటోలను ఆదేశించింది. ఇకపై సీఎంసీ అధికారులు హోటళ్లకు ఇచ్చే హైజీన్ రేటింగ్స్‌‌‌‌‌‌‌‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సీఎంసీతో సదరు ఫుడ్​డెలివరీ ప్లాట్​ఫామ్స్​కో ఆర్డినేట్​చేసుకోవడానికి ప్రత్యేక నోడల్ ఆఫీసర్​ను నియమించాలని, తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై వెంటనే స్పందించే కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది.  

  • స్విగ్గీ, జొమాటోలకు నోటీసులు  

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఫుడ్ అమ్మే  చాలా హోటల్స్​కు ట్రేడ్ లైసెన్స్ ఉండడం లేదు. అలాగే, కస్టమర్లు నెగటివ్ రివ్యూ ఇస్తే వాటిని తొలగించి పాజిటివ్ రేటింగ్స్ మాత్రమే చూపిస్తున్నారు. ఇలాంటి విషయాలు సైబరాబాద్ మున్సిపల్​కార్పొరేషన్​అధికారుల దృష్టికి రావడంతో స్విగ్గి, జొమాటోలకు నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలు, నిబంధనలు, ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా తెలియజేసేలా ఒక రిపోర్ట్​ఇవ్వలని ఆదేశించింది.  

అలాగే, సదరు ప్లాట్​ఫామ్స్​లో నమోదైన ప్రతి హోటల్‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్లకు ​ఎఫ్ఎస్​ఎస్​ఏఐ లైసెన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సీఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలని, వాటినే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని  కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో సస్పెండ్ అయినా, లైసెన్స్ రద్దయినటు హోటళ్లు, రెస్టారెంట్లను తొలగించాలని సీఎంసీ స్పష్టం చేసింది. ప్రతి ఫుడ్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన జియో లొకేషన్‌‌‌‌‌‌‌‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని, నమోదైన ప్రాంగణం నుంచే ఆహారం తయారుచేసి సరఫరా చేయాలని ఆర్డర్​పాస్​చేశారు. ఒక చోట లైసెన్స్ తీసుకుని మరోచోట వంట చేసి పంపించే విధానానికి పూర్తిగా చెక్ పెట్టాలని కోరింది.