
అమీర్ పేటలోని కమర్షియల్ కాంప్లెక్స్లో సంస్థ హెడ్డాఫీసు
సిటీలో వివిధ ప్రాంతాల్లో జోనల్ ఆఫీసులు
అధికారులకు, సందర్శకులకు తప్పని ఇబ్బందులు
వైఎస్ఆర్ హయాంలో హైటెక్స్వద్ద 8 ఎకరాలు కేటాయింపు
కొత్త ప్రభుత్వమైనా నిర్మాణానికి దృష్టి పెట్టాలంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్,వెలుగు :
హైదరాబాద్మెట్రోపాలిటన్డెవలప్మెంట్అథారిటీ(హెచ్ఎండీఏ)కి సొంత భవనం కలగానే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా.. సంస్థకు పక్కా భవనం నిర్మించలేకపోయాయి. సిటీ పరిధిలో భారీ నిర్మాణాలు, లే అవుట్లకు పర్మిషన్లు ఇచ్చే హెచ్ఎండీఏకే సొంత భవనం లేకపోవడం గమనార్హం. గతంలో హుడా ఆఫీసుగా బేగంపేటలోని పైగా ప్యాలెస్లో కొనసాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పలు ప్రాంతాలకు ఆఫీసును తరలిస్తూ వస్తున్నారు. హుడా హెచ్ఎండీఏగా అవతరించింది. అయినా సంస్థకు ప్రత్యేక భవనం లేదు. అనుమతులకు వచ్చేవారు, లే అవుట్ల దరఖాస్తులు, భూముల వేలంలో పాల్గొనాలనుకునే వారికి ఇబ్బందిగా మారింది. బేగంపేట నుంచి హెచ్ఎండీఏను తరలించిన తర్వాత కొంతకాలం గ్రీన్లాండ్స్గెస్ట్హౌస్లో కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి తార్నాకలోని హెచ్ఎండీఏ కాంప్లెక్స్లోకి మార్చారు. అక్కడ కూడా దాదాపు పదిహేను ఏండ్లు ఆఫీసు కొనసాగించారు. అనంతరం అక్కడా సరైన వసతులు లేవనే కారణంగా అమీర్పేటలోని హుడా కమర్షియల్కాంప్లెక్స్స్వర్ణ జయంతిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఒకే ప్రాంగణంలో వివిధ రకాల వాణిజ్య సంస్థలు ఉండగా అధికారులు, వచ్చే సందర్శకులకు ఇబ్బందులు వస్తున్నాయి. స్వర్ణ జయంతి కాంప్లెక్స్ హెచ్ఎండీఏకు చెందినదే అయినా ఇతర వ్యాపార సంస్థలు కూడా ఉండగా పలు సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికే స్టేటస్సింబల్గా ఉండాల్సిన హెచ్ఎండీఏకు ప్రత్యేక ఆఫీసుకు భవనం ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వాటర్బోర్డు, బల్దియా, కలెక్టరేట్, విద్యుత్, ఫారెస్ట్.. ఇలా దాదాపు అన్నిరకాల ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉన్నాయి. కానీ.. హెచ్ఎండీఏకు లేకపోవడం లోపంగానే ఉందని అధికారులు అంటున్నారు.
కాంగ్రెస్ హయాంలోనే స్థలం కేటాయింపు!
వైఎస్ఆర్ హయాంలోనే హెచ్ఎండీఏకు సొంత భవనం నిర్మించాలని చర్యలు తీసుకున్నారు. మాదాపూర్లోని హైటెక్స్ వద్ద 8 ఎకరాల భూమిని కూడా కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణంతో అప్పట్లో ప్రతిపాదన పెండింగ్లో పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో నిర్మించాలని ప్రయత్నించినా.. దీనిపై పెద్దగా పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. అన్ని వనరులూ ఉన్నా వివిధ కారణాలతో కార్యరూపంలోని రాలేదని అంటున్నారు. హెచ్ఎండీఏ 7,228 చ. కి.మీ. పరిధిలో విస్తరించింది. దీని కింద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్జిల్లాలు ఉన్నాయి. 849 గ్రామాలు కూడా కలిసి ఉన్నాయి. ఇంత పెద్ద సంస్థ పరిధిలో నాలుగు శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్,మేడ్చల్జోనల్ ఆఫీసులు ఉన్నాయి. త్వరలో వీటి సంఖ్య కూడా మరింత పెరిగే చాన్స్ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి భారీ సంస్థకు ప్రత్యేకంగా ఆఫీసు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి రావడంతో మరోసారి సొంత భవనంపై చర్చలు మొదలయ్యాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కానీ, సిటీలో వేరే చోటనైనా కొత్త భవనం నిర్మిస్తే బాగుంటుందని కొందరు అధికారులు వాదిస్తున్నారు.
మరిన్ని భారీ ప్రాజెక్టులు చేపడుతుండగా..
ఔటర్ రింగ్రోడ్భారీ ప్రాజెక్టును నిర్మించిన హెచ్ఎండీఏ భవిష్యత్ రోజుల్లో మాస్టర్ప్లాన్తో పాటు మూసీ ప్రక్షాళన పథకం, మరిన్ని భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతుంది. కానీ సంస్థ సంబంధిత ఆఫీసులు దూరంలో ఉండడంతో చాలా సందర్భాల్లో పనులు ఆలస్యమవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రధాన ఆఫీసు అమీర్ పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్లో ఉండగా, వివిధ ప్రాంతాల్లో జోనల్ఆఫీసులు, ట్యాంక్ బండ్ వద్ద బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆఫీసు, గ్రోత్కారిడార్ఆఫీసు, మూసీ రివర్డెవలప్ మెంట్ కార్పొరేషన్ఆఫీసు కూడా నానక్రామ్గూడలోనే ఉంది. ఇలా ఒక్కో ఆఫీసు ఒక్కో ప్రాంతంలో ఉండడంతో కొన్ని సందర్భాల్లో అధికారుల మధ్య కమ్యూనికేషన్ లోనూ ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. ఆయా పనుల కోసం వెళ్లేవారు సైతం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. హెచ్ఎండీఏ పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్ర్యతేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో గతంలో చేసిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వాలని కూడా అధికారులు కోరుతున్నారు.