
- రూల్స్ బేఖాతరు చేస్తూ నచ్చినట్టుగా అనుమతులు
- కొన్నిచోట్ల ఇల్లీగల్ మైనింగ్ కు వత్తాసు
- గుట్టలు, చెరువులు కొల్లగొడుతున్నా పట్టనివైనం
- అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
హనుమకొండ, వెలుగు: జిల్లాలో మైనింగ్ పర్మిషన్ల పేరుతో అక్రమ దందా నడుస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ఆఫీసర్లు నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కు పర్మిషన్లు ఇస్తుండటంతో అనుమతుల సాకుతో నిర్వాహకులు ఇష్టారీతిన బ్లాస్టింగులకు పాల్పడుతున్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ ను ఆనుకుని ఉన్న గుట్టకు ఆఫీసర్లు కంకర క్వారీకి పర్మిషన్ ఇచ్చిన విషయమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుండగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు బాగానే జరిగాయి. ఓవైపు అవినీతికి పాల్పడుతున్న మైనింగ్ ఆఫీసర్లు ఇష్టమొచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చేస్తుండగా, ఎన్వోసీలు ఇవ్వాల్సిన పీసీబీ, రెవెన్యూ అధికారులు, బ్లాస్టింగులపై దృష్టిపెట్టాల్సిన పోలీసులు కూడా అక్రమ తంతులో భాగం పంచుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ దందా చేస్తున్నా ఆఫీసర్లు మామూళ్లు తీసుకుంటూ వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రిజర్వాయర్ ఆనుకుని క్వారీకి పర్మిషన్..
హనుమకొండ జిల్లాలో దాదాపు 122 క్వారీలకు ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చారు. మైనింగ్ చేపట్టే పరిసర ప్రాంతాల్లో చెరువులు, రిజర్వాయర్లు, ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లు, ఆలయాలు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంతేగాకుండా స్థానికుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, నిబంధనల మేరకు అనుమతులివ్వాలి. కానీ, ఇక్కడ అదంతా ఏమీ జరగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ దరఖాస్తులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ ఆఫీసర్లు ఇష్టమొచ్చినట్లు ఎన్వోసీలు జారీ చేస్తుంటే, దాని ప్రకారం మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
దేవాదుల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ధర్మసాగర్ రిజర్వాయర్ ను మైనింగ్ కు పర్మిషన్లు ఇవ్వడం, అక్కడ బ్లాస్టింగ్స్ చేపట్టడం చర్చనీయాంశంగా మారగా, అసలు అక్కడ అనుమతులు ఎలా ఇచ్చారనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదిలాఉంటే గతంలో ధర్మసాగర్ మండలంలో చారిత్రక ఆనవాళ్లకు నెలవైన నారాయణగిరి బోడగుట్ట, నడిమిబోడు గుట్టలపై గ్రానైట్, క్రషర్ క్వారీల నిర్వహణకు అనుమతులు కూడా ఇచ్చారు. ఆదిమానవులు, జైనులు, బౌద్ధుల చరిత్ర ఆనవాళ్లు ఉన్నా, ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతోపాటు ఐనవోలు, హసన్ పర్తి మండలం మునిపల్లి శివారులో చారిత్రక ఆనవాళ్లున్న గుట్టలపై కూడా మైనింగ్ అనుమతులు ఇచ్చారు. దీంతో ఇప్పుడు హిస్టారికల్ ప్లేసులన్నీ మైనింగ్ మాఫియా చేతుల్లో ధ్వంసం అవుతుండటం గమనార్హం.
జిలెటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్స్..
ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని మైనింగ్ పర్మిషన్లు తెచ్చుకుంటున్న క్వారీల నిర్వాహకులు ఆ తర్వాత గుట్టలను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలు వాడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలను గుట్టుగా తెప్పించుకుంటున్న నిర్వాహకులు వాటితో గుట్టలను గుల్ల చేసేస్తున్నారు. కాగా, ధర్మసాగర్ మండలంలో జిలెటిన్ స్టిక్స్ వినియోగం ఎక్కువగా ఉంటుండగా, ఇంతవరకు వాటిపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. 2023 డిసెంబర్ లో ఓ వ్యక్తి ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఓ హోటల్ ను పేల్చేసేందుకు ప్రయత్నం చేయగా, ఆ సమయంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మట్టి, మొరం దందాపై సైలెంట్..
మైనింగ్, రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు మామూళ్లకు అలవాటు పడి మొరం, మట్టి దందాకు కూడా వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ వరంగల్ లో జరిగే నిర్మాణాలతోపాటు ఇతర వెంచర్లకు చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి ఇల్లీగల్ గా మొరం, మట్టి తరలిస్తున్నా ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐనవోలు, ధర్మసాగర్, హసన్ పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్, నడికూడ, పరకాల తదితర మండలాల్లో మట్టి, మొరం దందా జోరుగా సాగుతోంది.
దాదాపు రెండు నెలల కిందట ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగగా, ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఆ పార్టీ లీడర్లు వేలాది ట్రిప్పుల మొరం, మట్టిని మీటింగ్ అవసరాలకు వినియోగించారు. ఆ తర్వాత 'వెలుగు'లో కథనం పబ్లిష్ అయ్యాకతనిఖీల పేరుతో హడావుడి చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనింగ్ దందాకు చెక్ పెట్టాల్సిన ఆఫీసర్లే నిర్వాహకులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలుండగా, జిల్లా ఉన్నతాధికారులైనా దృష్టి పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.