హృదయవిదారక ఘటన.. కారులో ఏడు డెడ్ బాడీలు.. కావాలనే డోర్లు లాక్ చేసుకుని..

హృదయవిదారక ఘటన.. కారులో ఏడు డెడ్ బాడీలు.. కావాలనే డోర్లు లాక్ చేసుకుని..

పంచకుల: హర్యానాలోని పంచకులలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు పార్కింగ్ చేసిన కారులో లభ్యమయ్యాయి. పంచకుల సెక్టార్ 27లో ఉన్న ఒక ఇంటి ముందు ఉన్న కారులో ఏడుగురు చనిపోయి కనిపించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం తెల్లవారుజామున ఈ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వారిని డెహ్రాడూన్కు చెందిన ప్రవీణ్ మిట్టల్ (42) కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

ప్రవీణ్ మిట్టల్, అతని భార్య, ముగ్గురు పిల్లలు, ప్రవీణ్ మిట్టల్ తల్లిదండ్రులు చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. భారీగా అప్పులు పాలైన ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. డెహ్రాడూన్ కు చెందిన ప్రవీణ్ మిట్టల్ కుటుంబంతో కలిసి పంచకులలో జరిగిన హనుమాన్ కథ ప్రోగ్రాంకు వెళ్లారు. ఈ ఈవెంట్ అయిపోయాక.. డెహ్రాడూన్కు వెళుతున్న క్రమంలో ప్రవీణ్ మిట్టల్ కుటుంబం ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోలీసులకు కారులో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఉద్దేశపూర్వకంగా కారు డోర్లన్నీ మూసేసుకుని ఊపిరాడని స్థితిలో విషం తాగి ఈ కుటుంబం చనిపోయిందని తెలిసింది.

స్థానికులు కారులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబాన్ని గమనించి 112కు కాల్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్కు సమాచారం అందించారు. ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకునే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది. స్థానికులు కారు డోర్లు ఓపెన్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఫోరెన్సిక్ బృందం, పోలీసులు కారు డోర్లు ఓపెన్ చేసి చూడగా ఏడుగురు విగత జీవులుగా పడి ఉన్నారు.

పంచకులలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి మార్చురీలో ఏడు మృతదేహాలను ఉంచారు. సూసైడ్ నోట్లో ఏముందనే విషయం పోలీసులు వెల్లడించలేదు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవడం.. అదీ ఇలా కారులో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికులను షాక్కు గురిచేసింది. పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ క్రైం సీన్కు చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ టీం చేసిన అనాలసిస్లో సామూహిక ఆత్మహత్యలుగా తేలిందని చెప్పారు.