
- తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో శుక్రవారం గంటపాటు జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇటీవల మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూలు నిర్వహించి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడారు. పీసీసీ అబ్జర్వర్లతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పార్టీ పరిస్థితులు, నేతలు, క్యాడర్ మధ్య సమన్వయంపై అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ విషయాలను సీఎంకు మీనాక్షి వివరించినట్లు తెలిసింది. ముఖ్యంగా పలు నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రుల మధ్య విభేదాలు, నేతల మధ్య సమన్వయలోపం గురించి ఆయనకు చెప్పినట్టు సమాచారం. అలాగే, తనకు వచ్చిన ఫిర్యాదుల గురించీ సీఎంతో చెప్పినట్టు తెలిసింది. మరోవైపు పెండింగ్లో ఉన్న పీసీసీ కమిటీలు, కార్పొరేషన్ పదవులు, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.