జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు అధికారులు మృతి

జమ్మూలో  ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు అధికారులు మృతి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.  అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు స్పందించి ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు అధికారులు వీరమరణం పొందారు. ఈ కాల్పుల్లో ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్‌ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హుమాయున్ భట్ లు చనిపోయారు.  మన్‌ప్రీత్‌ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్ కు చెందిన వారిగా గుర్తించారు.

ఉగ్రవాదులు దాక్కున్న అనంత్‌నాగ్‌ జిల్లాలోని కోకెర్‌నాగ్‌ తహసీల్ లోని గాడోల్ ప్రాంతంలో కాల్పులు జరిగాయని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.  లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు ఆర్మీ అధికారులు  వెల్లడించారు.   సెప్టెంబర్ 7 నుంచి భారత ఆర్మీ,  జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు.  అయితే సెప్టెంబర్ 12న భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. రెండో ఉగ్రవాదిని సెప్టెంబర్ 13న భద్రతా బలగాలు హతమార్చాయి.